కేదారనాథ్ యాత్రికులకు వచ్చే ఏడాది నుంచి మసాజ్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. గౌరికుండ్ నుంచి కేదార్నాథ్ వరకు ఉన్న 16 కిలోమీటర్ల మార్గంలో మొత్తం 7 మసాజ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
మసాజ్ కుర్చీలతో కూడిన ఈ కేంద్రాలను ప్రధాన విశ్రాంతి ప్రాంతాలైన భీంబాలి, లింకోలి, రుద్ర పాయింట్, జంగిల్చట్టిల్లో ఏర్పాటు చేయనున్నట్లు రుద్రప్రయాగ్ జిల్లా కలెక్టర్ మంగీశ్ ఘిల్గియాల్ తెలిపారు. ప్రయాణంతో తీవ్ర అలసటకు గురయ్యే ప్రయాణికులకు ఉపశమనాన్ని కలిగించేందుకే ఈ కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.
అంతేకాకుండా ఈ ఏర్పాట్ల వల్ల స్థానిక నిరుద్యోగ యువతకు ఆదాయం పోందే అవకాశమూ ఉంటుందని పేర్కొన్నారు అధికారులు. మార్గం మధ్యలో వసతి సదుపాయాలు, సౌకర్యాలను మెరుగుపరిచినందుకే ఈ ఏడాది రికార్డు స్థాయిలో 10 లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో గాడిదలు, గుర్రాలపై వెళ్లే యాత్రికులు హెల్మెట్ ధరించటం తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. వీటితో పాటు గుర్రాలను అదుపుచేసే వారు కూడా హెల్మెట్ ధరించాలని సూచించారు. యాత్ర మార్గంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:దిల్లీ కాలుష్యంపై భారత్-బ్రిటన్ శాస్త్రవేత్తల ఉమ్మడి పోరు