నెలరోజులుగా జాతీయస్థాయిలో చర్చనీయాంశమైన మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. సొంతపార్టీని వదిలి భాజపా పక్షాన చేరిన ఎన్సీపీ నేత అజిత్ పవార్.... ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. బుధవారం సాయంత్రం 5 గంటలలోగా బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన కొద్ది గంటలకే ఈ నిర్ణయం తీసుకున్నారు అజిత్.
శరద్ వ్యూహంతోనే...
అజిత్ నిర్ణయానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అమలు చేసిన తెరవెనుక వ్యూహమే కారణంగా తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ద్వారా అజిత్పై శరద్ ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే భర్త... ఇందుకోసం గత రాత్రి అజిత్తో చర్చలు జరిపినట్లు సమాచారం.
ముందు నుంచి వ్యూహాత్మకంగా...
అజిత్ పవార్ భాజపా పక్షాన చేరినా... శరద్ పవార్ మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. "అవి అజిత్ వ్యక్తిగత నిర్ణయాలు" అనడం మినహా ఆయనపై పెద్దగా విమర్శలు చేయలేదు. పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. అజిత్ను పార్టీలోకి తిరిగి తీసుకునేందుకు వీలుగానే శరద్ ఇలా చేశారని సమచారం.
అజిత్ పవార్ వ్యవహార శైలి కూడా అలానే ఉంది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర బాధ్యతలు స్వీకరించినా... అజిత్ మాత్రం డిప్యూటీ సీఎంగా ఇంకా బాధ్యతలు చేపట్టలేదు.
ఇలాంటి ఎన్నో పరిణామాల నేపథ్యంలో శరద్ పవార్ వ్యూహం ఫలించింది.
ఇదీ చూడండి: పార్లమెంట్ సంయుక్త సమావేశం బహిష్కరించిన విపక్షాలు