ఉత్తర్ప్రదేశ్ కాన్పుర్లోని బిక్రూ గ్రామం.. జులై 3 సాయంత్రం.. గ్యాంగ్స్టర్ వికాస్ దుబేను అరెస్టు చేసేందుకు కాన్పుర్ డీఎస్పీ దేవేంద్ర మిశ్రా నేతృత్వంలోని పోలీసులు బృందం అతని ఇంటికి వెళ్లింది. హఠాత్తుగా దుబే అనుచరులు మిశ్రా బృందంపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు.
ఈ ఘటనలో మిశ్రాతో సహా 8 మంది పోలీసులు అమరులయ్యారు. ఓ గ్యాంగ్స్టర్ చేసిన ఈ దాడి దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే దుబేకు సమాచారం ఇచ్చింది ఇంటి దొంగలేనని అప్పట్లో వార్తలు వచ్చాయి. విచారించిన పోలీసులు కూడా కొంతమంది అధికారులను సస్పెండ్ చేశారు.
![Kanpur raid](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8325245_zxc.jpg)
ఆడియో క్లిప్పులో సాక్ష్యాలు!
ఈ ఘటనకు సంబంధించి తాజాగా ఓ ఆడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కాన్పుర్ ఎస్పీ బ్రిజేశ్ శ్రీవాస్తవతో మిశ్రా మాట్లాడినట్లు ఉన్న ఈ ఆడియో క్లిప్.. దుబే ఇంటికి వెళ్లే ముందు జరిగిన సంభాషణనేనా? వారి సంభాషణను బట్టి దుబేకు చౌబేపుర్ స్టేషన్ అధికారి (ఎస్ఓ) వినయ్ తివారీ ఉప్పందించి ఉంటాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తివారీ ఒత్తిడితోనే ముందుగా మిశ్రా.. దుబేను పట్టుకునేందుకు వెళ్లారా? మిశ్రా దుబే ఇంటికి వెళ్లిన తర్వాతనే తివారీ వస్తానని పట్టుబట్టాడా? అసలు ఈ ఆడియో క్లిప్లో ఏముంది?
ఎస్పీతో మిశ్రా సంభాషణ ఇలా..
మిశ్రా: దుబేను పట్టుకునేందుకు ముందుగా నన్ను వెళ్లమని ఎస్ఓ చెప్పాడు. నేను అక్కడికి చేరుకున్న తర్వాతనే ఆయన వస్తానన్నాడు. అందుకే నేను వెళుతున్నా.
ఎస్పీ: మీరు కంగారు పడాల్సిన పనిలేదు. మీరు ఆలోచించి పనిచేయండి. దుబేను పట్టుకొనే గొప్ప అవకాశం ఇది.
మిశ్రా: దుబేకు తివారీ అన్ని విధాల సహకరిస్తున్నాడు. అతని గురించి నేను చెబుతాను. దుబేతో అతనికి సంబంధాలు ఉంటే మరో మూడు నాలుగు హత్యలు జరుగుతాయి. ఒక నేరస్థుడి గురించి మరో నేరస్థుడే చెప్పగలడు. ఇప్పటికే దుబేకు మన రెయిడ్ గురించి సమాచారం ఇచ్చి పారిపోవాలని చెప్పి ఉంటాడు.
ఈ ఆడియో క్లిప్లో చివరగా మాజీ ఎస్ఎస్పీ అనంత్ దేవ్ తివారీపైనా మిశ్రా ఆరోపణలు చేశారు. ఎస్ఓ నుంచి రూ.5 లక్షలు తీసుకుని అన్ని దర్యాప్తులను అనంత్ దేవ్ వదిలేశారని వెల్లడించారు.
తివారీతో మిశ్రా మాట్లాడిన మరో ఆడియో క్లిప్ కూడా బయటకు వచ్చింది.
వీరిద్దరిపై విచారణ..
తొలుత దుబేకు ఎస్ఓ వినయ్ తివారీ సమాచారం ఇచ్చారని పోలీసులు అనుమానించారు. అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విషయంలో ఎస్ఎస్పీ అనంత్ దేవ్ను కూడా అనుమానించిన పోలీసులు మురాదాబాద్ పీఏసీకి తరలించారు.
ఇదీ చూడండి: రౌడీషీటర్ల దాడిలో 8 మంది పోలీసులు మృతి