జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల ఘటనతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కు చెందిన 25ఏళ్ల రెజ్లర్ అజీత్గా గుర్తించారు పోలీసులు. పౌర నిరసనకారులపై కాల్పులు జరిపిన మైనర్కు అజీత్ తుపాకీ అమ్మినట్టు అధికారులు ధ్రువీకరించారు.
ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు... మంగళవారం అజీత్ను కోర్టులో హాజరుపరచనున్నారు.
ఇదీ జరిగింది...
జనవరి 30న మధ్యాహ్నం జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం వద్ద ఓ దుండగుడు తుపాకీతో కలకలం సృష్టించాడు. సీఏఏ నిరసనకారులపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ విద్యార్థికి గాయాలయ్యాయి. మిగిలిన వారు అతడిని చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడ్డ విద్యార్థికి చికిత్స అందిస్తున్నారని... అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని అధికారులు తెలిపారు.
తుపాకీతో దాడికి తెగబడ్డ దుండగుడు మైనర్ అని తెలుస్తోంది. అతడి వయసుకు సంబంధించిన సీబీఎస్ఈ మార్క్ షీట్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది.
భారీ పోలీసు బలగం ఉన్నప్పటికీ.. 'ఇదిగో మీ స్వేచ్ఛ' అంటూ ఆగంతుకుడు తుపాకీతో దాడికి పాల్పడ్డాడు. అంతకు కొద్ది సేపటి ముందు 'షాహీన్బాగ్ ఖేల్ ఖతమ్(షాహీన్బాగ్ పని అయిపోయింది)' అని ఫేస్బుక్లో పోస్టు చేశాడు.
శాంతియుతంగా సాగుతున్న నిరసనలు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడం వల్ల నిరసనకారులు తీవ్ర అసహనానికి గురయ్యారు.