దిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల ఘటన క్షణాల్లో జరిగిపోయిందని తెలిపారు పోలీసులు. సీఏఏ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా శాంతియుత మార్గంలో నిరసనలు చేస్తున్న విద్యార్థులపై కాల్పులు జరగినందున... జామియా విద్యార్థులతో పాటు ఆప్ నుంచి తీవ్ర ఆరోపణలు ఎదురయ్యాయి. దుండగుడు కాల్పులు జరుపుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు తాజా ప్రకటన చేశారు.
" పోలీసులు స్పందించే సమయానికి నిందితుడు కాల్పులు జరిపాడు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. కేసును నేర విభాగానికి బదిలీ చేశాం. కాల్పులు జరిపిన వ్యక్తి మైనరా, కాదా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నాం."
- ప్రవీణ్ రంజన్, ప్రత్యేక పోలీస్ కమిషనర్
గురువారం కాల్పులు...
గురువారం మధ్యాహ్నం జామియా విశ్వవిద్యాలయం వద్ద ఓ దుండగుడు తుపాకీతో కలకలం సృష్టించాడు. సీఏఏ నిరసనకారులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ విద్యార్థికి గాయాలయ్యాయి. మిగిలిన వారు అతడిని చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడ్డ విద్యార్థికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.
వైద్య ఖర్చులు తామే భరిస్తామని విశ్వవిద్యాలయం ఉపకులపతి నజ్మా అక్తర్ తెలిపారు.
ఇదీ చదవండి: 'జైలుకు వెళ్లకపోతే.. రాజకీయ నాయకుడివి ఎలా అవుతావు'