గుజరాత్ బూటకపు ఎన్కౌంటర్ల కేసులో ఇద్దరు మాజీ పోలీస్ అధికారులకు ఊరట లభించింది. ఇష్రత్ జహాన్ కేసులో సీబీఐ విచారణ నుంచి మాజీ అధికారులు డీజీ వంజారా, ఎన్కే అమిన్లను విముక్తి కల్పించింది అహ్మదాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు.
విచారణ నుంచి విముక్తి కల్పించాలని వంజారా, అమిన్ కోర్టుకు దరఖాస్తు సమర్పించారు. మొదట తిరస్కరించిన కోర్టు.. సీబీఐ దర్యాప్తునకు గుజరాత్ ప్రభుత్వం కూడా అనుమతులిచ్చేందుకు నిరాకరించటం వల్ల పిటిషన్ స్వీకరించింది. ప్రభుత్వ అనుమతులు లేని కారణంగా కేసు నుంచి అధికారులకు విముక్తి కల్పిస్తూ తీర్పునిచ్చారు సీబీఐ కోర్టు న్యాయమూర్తి జేకే పాండ్య.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 197 ప్రకారం విధుల్లో భాగంగా ఉద్యోగులు చేసిన పనులపై విచారణకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.
భిన్న వాదనలు
ఇష్రత్ తల్లి షమీమా కౌజర్ గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ కేసు కేంద్ర హోంశాఖకు సంబంధించిందనీ, ఇందులో గుజరాత్ జోక్యం అవసరంలేదని ఆమె తరఫు న్యాయవాది బృందా గ్రోవర్ వాదించారు.
ఎన్కౌంటర్లు బూటకమనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని వంజారా, అమిన్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. గత రికార్డులన్నీ పరిశీలించాకే అనుమతులిచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించిందని తెలిపారు.
సిట్ నుంచి సీబీఐకి...
2004 జూన్ 15న అహ్మదాబాద్ సమీపంలో ఎన్కౌంటర్ జరిగింది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీపై హత్యాయత్నానికి కుట్ర పన్నారని ఆరోపిస్తూ 19 ఏళ్ల ఇష్రత్, జావెద్ షేక్, అమ్జద్ అలీ అక్బరలీ రాణా, జీషాన్ జోహార్లను కాల్చిచంపారు పోలీసులు.
ఎన్కౌంటర్లపై ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమిస్తూ గుజరాత్ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఎన్కౌంటర్ బూటకమని సిట్ తేల్చిన తర్వాత ఈ కేసు సీబీఐకి బదిలీ అయింది.
2013లో సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రంలో ఏడుగురు గుజరాత్ పోలీస్ అధికారులను చేర్చారు. ఇందులో ఐపీఎస్ అధికారులు పీపీ పాండే, వంజారా, జీ ఎల్ సింఘాల్ తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి: అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఐరాస