ETV Bharat / bharat

భాగస్వామ్యాలతో భారత్​ దూకుడు- చక్రబంధంలో చైనా

author img

By

Published : Oct 29, 2020, 9:44 AM IST

బలగర్వంతో భారత్‌ను ఉక్కిరి బిక్కిరి చేయాలనుకున్న చైనా తానే చక్రబంధంలో ఇరుక్కుపోనున్నది. లద్దాఖ్‌ నుంచి తైవాన్‌ వరకు ప్రతి చోటా కయ్యానికి కాలుదువ్వుతున్న 'బీజింగ్‌' ఆట కట్టించడానికి భారత్‌తో అమెరికా చేతులు కలిపింది. 'క్వాడ్‌'లో సాటి సభ్యులైన జపాన్‌, ఆస్ట్రేలియాలతో పాటు ఇతర ఆసియా దేశాలనూ కలుపుకొని ముందుకు సాగాలని నిర్ణయించింది. అందుకే అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో.. భారత్‌తో పాటు శ్రీలంక, మాల్దీవులు, ఇండోనేసియాలలోనూ పర్యటిస్తున్నారు. ఇంతకాలం శ్వేతపత్రాలకు, చర్చలకు, అడపాదడపా సైనిక కవాతులకు పరిమితమైన క్వాడ్‌ కూటమి ఇక బీజింగ్‌పై కత్తి ఝుళిపించక తప్పదని గ్రహిస్తోంది!

India's aggression with partnerships to target china
భాగస్వామ్యాలతో భారత్​ దూకుడు- చక్రబంధంలో చైనా

నాడు సోవియట్‌ యూనియన్‌ను నిలువరించడానికి ఐరోపాలో 'నాటో' సైనిక కూటమిని ఏర్పరచిన అమెరికా, నేడు ఆసియాలో చైనాకు అడ్డుకట్ట వేయడానికి 'క్వాడ్‌' రూపంలో ఆసియా నాటోను సిద్ధం చేయాలని లక్షిస్తోంది. క్వాడ్‌లో అమెరికాతోపాటు సభ్యులుగా ఉన్న భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియాలు సైనిక కూటమిగా ఏర్పడటానికి ఇంతవరకు తొందరపడకపోయినా, ఇటీవల చైనా కత్తి ఝుళిపింపులు ఎక్కువ అవడంతో పరిస్థితి మారుతోంది. అక్టోబరు 6న టోక్యోలో క్వాడ్‌ సమావేశం జరిగిన తరవాత 26, 27 తేదీలలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో భారత్‌, శ్రీలంక, మాల్దీవులను సందర్శించారు. భారత్‌తో కీలకమైన రక్షణ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. భారతదేశ సార్వభౌమత్వానికి ఎదురవుతున్న ప్రమాదాలను ఎదుర్కోవడానికి అమెరికా అండగా నిలబడుతుందని ప్రకటించారు. దీంతో తీవ్రంగా కలవరపడిన చైనా- ద్వైపాక్షిక సమస్యలను మూడో పక్షం జోక్యం లేకుండా దిల్లీ, బీజింగ్‌లు పరిష్కరించుకోవాలని పిలుపు ఇచ్చింది.

'డ్రాగన్‌' ప్రాబల్యానికి అడ్డుకట్ట

అసలు పరిస్థితి ఈకాడికి రావడానికి చైనా కబ్జాకోరు ధోరణే కారణం. 2007లో అమెరికా, భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియాలతో చతుర్భుజి (క్వాడ్‌) ఏర్పడిన నాటి నుంచే దాన్ని ‘ఆసియన్‌ నాటో’గా మలచాలని అమెరికా ప్రయత్నిస్తూ వచ్చింది. కానీ, మిగతా మూడు భాగస్వామ్య దేశాలు చైనాతో నేరుగా తలపడటానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ఇంతలో అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్‌ ట్రంప్‌ 2017నుంచి తమ ప్రథమ శత్రువు చైనాయే అన్నట్లు ప్రవర్తించసాగారు. ఇక చైనా తన ఇరుగుపొరుగులతో కయ్యానికి కాలు దువ్వడం ఎక్కువ చేసింది. ఈ నేపథ్యంలో ఇంతవరకు దౌత్య ప్రతినిధుల స్థాయికి పరిమితమైన క్వాడ్‌ సమావేశాలు అక్టోబరు 6న విదేశాంగ మంత్రుల స్థాయికి ఎదిగాయి. ఆ రోజు టోక్యోలో జరిగిన సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో కరోనా వైరస్‌ వుహాన్‌లో పుట్టిందనీ, చైనా కమ్యూనిస్టు పార్టీ దాన్ని గుట్టుగా ఉంచడంతో ప్రపంచ పరిస్థితి దారుణంగా తయారైందని దుయ్యబట్టారు. తూర్పు, దక్షిణ చైనా సముద్రాలలో; తైవాన్‌ జలసంధిలో, మెకాంగ్‌లో, హిమాలయాలలో చైనా ఆగడాలు పొరుగుదేశాలను కలవరపరుస్తున్నాయని పేర్కొన్నారు. ఆ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జయశంకర్‌ కానీ; జపాన్‌, ఆస్ట్రేలియా మంత్రులు కానీ చైనాను పేరెత్తి విమర్శించడానికి ఇష్టపడలేదు. మహా సముద్రాలలో భారత్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఫ్రాన్స్‌ ప్రకటించగా, జర్మనీ చైనాపై దౌత్యపరమైన ఒత్తిడి పెంచుతోంది. ఉమ్మడి ప్రమాణాలను అనుసరించే అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పడాలనీ, అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాలను గౌరవించాలనీ, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలనీ భారత్‌, జపాన్‌ విదేశాంగ మంత్రులు క్వాడ్‌ భేటీలో కోరారు.

మొత్తం మీద చైనాకు చెక్‌ పెట్టడానికి అమెరికా ఈ అక్టోబరులో ఇండో పసిఫిక్‌, దక్షిణాసియాలపై దృష్టి కేంద్రీకరించింది. అక్టోబరు 6న క్వాడ్‌ భేటీలో పాంపియో పాల్గొనగా, అక్టోబరు 14న అమెరికా ఉప విదేశాంగ మంత్రి స్టీఫెన్‌ బీగన్‌ భారత్‌ సందర్శనకు వచ్చారు. చైనాపై ఆధారపడకుండా క్వాడ్‌ దేశాలు పకడ్బందీ సరఫరా గొలుసులను ఏర్పాటు చేసుకోవాలని, సముద్ర భద్రతను పెంపొందించుకోవాలని అన్నారు. భారత్‌నుంచి ఆయన బంగ్లాదేశ్‌కు వెళ్లారు. చైనా దూకుడును నిలువరించడానికి ట్రంప్‌ ప్రభుత్వం భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌, శ్రీలంక, మాల్దీవులను కలుపుకొని వెళ్లాలని ప్రయత్నిస్తోంది. అందుకే అక్టోబరు 26న భారత్‌కు వచ్చి కీలక రక్షణ ఒప్పందాలను కుదుర్చుకున్న పాంపియో 27న శ్రీలంక వెళ్లారు. ఆపైన మాల్దీవులను కూడా సందర్శిస్తారు. భారత్‌, అమెరికాలు కుదుర్చుకున్న కీలక బెకా ఒప్పందం చైనాను కలవరపెడుతోంది.

అమెరికా తనను చక్రబంధంలో ఇరికించాలని చూస్తోందని చైనా రుసరుసలాడుతోంది. లద్దాఖ్‌ సమస్యపై గతవారం భారత్‌, చైనా సేనానుల మధ్య జరగాల్సిన సమావేశాన్ని బీజింగ్‌ వాయిదా వేసింది. నిజానికి ఇప్పటివరకు క్వాడ్‌లో అమెరికా ఒక్కటే బాహాటంగా చైనా వ్యతిరేక వైఖరిని ప్రదర్శించగా, మిగతా మూడు దేశాలు సామరస్య ధ్వనులనే వినిపిస్తూ వచ్చాయి. తమ ఆర్థిక, భద్రతాపరమైన ప్రయోజనాల గురించే మాట్లాడాయి. చైనా తీరు మారకపోతే క్వాడ్‌ దేశాలూ తమ వైఖరిని సమీక్షించుకోవలసి వస్తుంది. భారత్‌ ఇప్పటికే ఆ పని చేస్తోంది. పసిఫిక్‌ మహా సముద్రం నుంచి హిమాలయాల వరకు అనేకానేక దీవులు, పర్వతాలు తనవేనంటూ చైనా రెచ్చిపోతూనే ఉంటే క్వాడ్‌ కరకు పంథా చేపట్టాల్సి రావచ్చు. ఇంతవరకు ఒరలోని కత్తిలా ఉన్న క్వాడ్‌, రేపు రివ్వున ఒర నుంచి దూసుకొస్తుంది. చైనా దుస్సాహసాలే క్వాడ్‌ దేశాలను ఆసియా నాటోగా రూపాంతరం చెందించవచ్చు.

ఆర్థిక అస్త్ర సంధానం

అది జరగకుండా చూడటానికి చైనా- వాణిజ్యాన్ని అస్త్రంగా ప్రయోగిస్తోంది. క్వాడ్‌ దేశాలన్నింటికీ చైనాయే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇప్పటికే ఆస్ట్రేలియాపై బీజింగ్‌ ఆర్థికపరంగా ఒత్తిడి పెంచింది. ఆస్ట్రేలియన్‌ బార్లీ, గొడ్డు మాంసం దిగుమతులపై భారీ సుంకాలు విధించిన చైనా, ఇటీవల ఆస్ట్రేలియన్‌ పత్తి కొనరాదంటూ తమ స్పిన్నింగ్‌ మిల్లులకు సూచిస్తోంది. పత్తి దిగుమతులపై 40శాతం అధిక పన్ను విధిస్తానంటోంది. ఆస్ట్రేలియా తాను ఇలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఇంతవరకు వాణిజ్యపరంగా బీజింగ్‌ ఆధిక్యాన్ని ఎదుర్కోవాలనుకున్న ఆస్ట్రేలియా, భారత్‌, జపాన్‌లు ఇక సైనికంగా కూడా హెచ్చరిక సంకేతాలు పంపదలిచాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతాల్లో ఆపరేషన్‌ మలబార్‌ పేరిట భారత్‌, అమెరికా, జపాన్‌లు నిర్వహించే నౌకా విన్యాసాల్లో ఆస్ట్రేలియా ఈ ఏడాది పాలుపంచుకోనున్నది.

అంతేకాదు, క్వాడ్‌ దేశాలు పారిశ్రామిక వస్తూత్పత్తికి కీలకమైన సరఫరా గొలుసులపై చైనా పట్టును ఛేదించదలిచాయి. క్వాడ్‌ ప్లస్‌ పేరుతో అమెరికా ఇప్పటికే వియత్నాం, న్యూజిలాండ్‌, దక్షిణ కొరియాలను కలుపుకొని పోతోంది. కొవిడ్‌వల్ల విచ్ఛిన్నమైన ఆర్థిక వ్యవస్థలను మళ్లీ పట్టాలెక్కించడానికీ, ప్రత్యామ్నాయ సరఫరా గొలుసుల ఏర్పాటు గురించి ఈ ఏడాది మార్చిలో క్వాడ్‌, క్వాడ్‌ ప్లస్‌ దేశాలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించాయి. రెండో క్వాడ్‌ ప్లస్‌ సమావేశంలో ఇజ్రాయెల్‌, బ్రెజిల్‌ పాలుపంచుకుని కొవిడ్‌ టీకాలు, ఆరోగ్య సంరక్షణ టెక్నాలజీల గురించి చర్చించాయి. క్వాడ్‌ ప్లస్‌ మార్గంలో మరిన్ని ఆసియాన్‌ సభ్యదేశాలను భాగస్వాముల్ని చేసుకోవాలి. చైనా ఉత్తరోత్రా తన కబ్జాకోరు విధానాలను విడనాడితే ఆ దేశాన్ని కూడా కలుపుకొని వెళ్లవచ్చు. కానీ, తాజాగా తైవాన్‌ మీద యుద్ధ భేరి మోగిస్తున్న చైనా తన దుందుడుకు పంథా విడనాడుతుందనుకోవడం అత్యాశే కావచ్చు.

- కైజర్‌ అడపా

నాడు సోవియట్‌ యూనియన్‌ను నిలువరించడానికి ఐరోపాలో 'నాటో' సైనిక కూటమిని ఏర్పరచిన అమెరికా, నేడు ఆసియాలో చైనాకు అడ్డుకట్ట వేయడానికి 'క్వాడ్‌' రూపంలో ఆసియా నాటోను సిద్ధం చేయాలని లక్షిస్తోంది. క్వాడ్‌లో అమెరికాతోపాటు సభ్యులుగా ఉన్న భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియాలు సైనిక కూటమిగా ఏర్పడటానికి ఇంతవరకు తొందరపడకపోయినా, ఇటీవల చైనా కత్తి ఝుళిపింపులు ఎక్కువ అవడంతో పరిస్థితి మారుతోంది. అక్టోబరు 6న టోక్యోలో క్వాడ్‌ సమావేశం జరిగిన తరవాత 26, 27 తేదీలలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో భారత్‌, శ్రీలంక, మాల్దీవులను సందర్శించారు. భారత్‌తో కీలకమైన రక్షణ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. భారతదేశ సార్వభౌమత్వానికి ఎదురవుతున్న ప్రమాదాలను ఎదుర్కోవడానికి అమెరికా అండగా నిలబడుతుందని ప్రకటించారు. దీంతో తీవ్రంగా కలవరపడిన చైనా- ద్వైపాక్షిక సమస్యలను మూడో పక్షం జోక్యం లేకుండా దిల్లీ, బీజింగ్‌లు పరిష్కరించుకోవాలని పిలుపు ఇచ్చింది.

'డ్రాగన్‌' ప్రాబల్యానికి అడ్డుకట్ట

అసలు పరిస్థితి ఈకాడికి రావడానికి చైనా కబ్జాకోరు ధోరణే కారణం. 2007లో అమెరికా, భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియాలతో చతుర్భుజి (క్వాడ్‌) ఏర్పడిన నాటి నుంచే దాన్ని ‘ఆసియన్‌ నాటో’గా మలచాలని అమెరికా ప్రయత్నిస్తూ వచ్చింది. కానీ, మిగతా మూడు భాగస్వామ్య దేశాలు చైనాతో నేరుగా తలపడటానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ఇంతలో అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్‌ ట్రంప్‌ 2017నుంచి తమ ప్రథమ శత్రువు చైనాయే అన్నట్లు ప్రవర్తించసాగారు. ఇక చైనా తన ఇరుగుపొరుగులతో కయ్యానికి కాలు దువ్వడం ఎక్కువ చేసింది. ఈ నేపథ్యంలో ఇంతవరకు దౌత్య ప్రతినిధుల స్థాయికి పరిమితమైన క్వాడ్‌ సమావేశాలు అక్టోబరు 6న విదేశాంగ మంత్రుల స్థాయికి ఎదిగాయి. ఆ రోజు టోక్యోలో జరిగిన సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో కరోనా వైరస్‌ వుహాన్‌లో పుట్టిందనీ, చైనా కమ్యూనిస్టు పార్టీ దాన్ని గుట్టుగా ఉంచడంతో ప్రపంచ పరిస్థితి దారుణంగా తయారైందని దుయ్యబట్టారు. తూర్పు, దక్షిణ చైనా సముద్రాలలో; తైవాన్‌ జలసంధిలో, మెకాంగ్‌లో, హిమాలయాలలో చైనా ఆగడాలు పొరుగుదేశాలను కలవరపరుస్తున్నాయని పేర్కొన్నారు. ఆ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జయశంకర్‌ కానీ; జపాన్‌, ఆస్ట్రేలియా మంత్రులు కానీ చైనాను పేరెత్తి విమర్శించడానికి ఇష్టపడలేదు. మహా సముద్రాలలో భారత్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఫ్రాన్స్‌ ప్రకటించగా, జర్మనీ చైనాపై దౌత్యపరమైన ఒత్తిడి పెంచుతోంది. ఉమ్మడి ప్రమాణాలను అనుసరించే అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పడాలనీ, అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాలను గౌరవించాలనీ, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలనీ భారత్‌, జపాన్‌ విదేశాంగ మంత్రులు క్వాడ్‌ భేటీలో కోరారు.

మొత్తం మీద చైనాకు చెక్‌ పెట్టడానికి అమెరికా ఈ అక్టోబరులో ఇండో పసిఫిక్‌, దక్షిణాసియాలపై దృష్టి కేంద్రీకరించింది. అక్టోబరు 6న క్వాడ్‌ భేటీలో పాంపియో పాల్గొనగా, అక్టోబరు 14న అమెరికా ఉప విదేశాంగ మంత్రి స్టీఫెన్‌ బీగన్‌ భారత్‌ సందర్శనకు వచ్చారు. చైనాపై ఆధారపడకుండా క్వాడ్‌ దేశాలు పకడ్బందీ సరఫరా గొలుసులను ఏర్పాటు చేసుకోవాలని, సముద్ర భద్రతను పెంపొందించుకోవాలని అన్నారు. భారత్‌నుంచి ఆయన బంగ్లాదేశ్‌కు వెళ్లారు. చైనా దూకుడును నిలువరించడానికి ట్రంప్‌ ప్రభుత్వం భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌, శ్రీలంక, మాల్దీవులను కలుపుకొని వెళ్లాలని ప్రయత్నిస్తోంది. అందుకే అక్టోబరు 26న భారత్‌కు వచ్చి కీలక రక్షణ ఒప్పందాలను కుదుర్చుకున్న పాంపియో 27న శ్రీలంక వెళ్లారు. ఆపైన మాల్దీవులను కూడా సందర్శిస్తారు. భారత్‌, అమెరికాలు కుదుర్చుకున్న కీలక బెకా ఒప్పందం చైనాను కలవరపెడుతోంది.

అమెరికా తనను చక్రబంధంలో ఇరికించాలని చూస్తోందని చైనా రుసరుసలాడుతోంది. లద్దాఖ్‌ సమస్యపై గతవారం భారత్‌, చైనా సేనానుల మధ్య జరగాల్సిన సమావేశాన్ని బీజింగ్‌ వాయిదా వేసింది. నిజానికి ఇప్పటివరకు క్వాడ్‌లో అమెరికా ఒక్కటే బాహాటంగా చైనా వ్యతిరేక వైఖరిని ప్రదర్శించగా, మిగతా మూడు దేశాలు సామరస్య ధ్వనులనే వినిపిస్తూ వచ్చాయి. తమ ఆర్థిక, భద్రతాపరమైన ప్రయోజనాల గురించే మాట్లాడాయి. చైనా తీరు మారకపోతే క్వాడ్‌ దేశాలూ తమ వైఖరిని సమీక్షించుకోవలసి వస్తుంది. భారత్‌ ఇప్పటికే ఆ పని చేస్తోంది. పసిఫిక్‌ మహా సముద్రం నుంచి హిమాలయాల వరకు అనేకానేక దీవులు, పర్వతాలు తనవేనంటూ చైనా రెచ్చిపోతూనే ఉంటే క్వాడ్‌ కరకు పంథా చేపట్టాల్సి రావచ్చు. ఇంతవరకు ఒరలోని కత్తిలా ఉన్న క్వాడ్‌, రేపు రివ్వున ఒర నుంచి దూసుకొస్తుంది. చైనా దుస్సాహసాలే క్వాడ్‌ దేశాలను ఆసియా నాటోగా రూపాంతరం చెందించవచ్చు.

ఆర్థిక అస్త్ర సంధానం

అది జరగకుండా చూడటానికి చైనా- వాణిజ్యాన్ని అస్త్రంగా ప్రయోగిస్తోంది. క్వాడ్‌ దేశాలన్నింటికీ చైనాయే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇప్పటికే ఆస్ట్రేలియాపై బీజింగ్‌ ఆర్థికపరంగా ఒత్తిడి పెంచింది. ఆస్ట్రేలియన్‌ బార్లీ, గొడ్డు మాంసం దిగుమతులపై భారీ సుంకాలు విధించిన చైనా, ఇటీవల ఆస్ట్రేలియన్‌ పత్తి కొనరాదంటూ తమ స్పిన్నింగ్‌ మిల్లులకు సూచిస్తోంది. పత్తి దిగుమతులపై 40శాతం అధిక పన్ను విధిస్తానంటోంది. ఆస్ట్రేలియా తాను ఇలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఇంతవరకు వాణిజ్యపరంగా బీజింగ్‌ ఆధిక్యాన్ని ఎదుర్కోవాలనుకున్న ఆస్ట్రేలియా, భారత్‌, జపాన్‌లు ఇక సైనికంగా కూడా హెచ్చరిక సంకేతాలు పంపదలిచాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతాల్లో ఆపరేషన్‌ మలబార్‌ పేరిట భారత్‌, అమెరికా, జపాన్‌లు నిర్వహించే నౌకా విన్యాసాల్లో ఆస్ట్రేలియా ఈ ఏడాది పాలుపంచుకోనున్నది.

అంతేకాదు, క్వాడ్‌ దేశాలు పారిశ్రామిక వస్తూత్పత్తికి కీలకమైన సరఫరా గొలుసులపై చైనా పట్టును ఛేదించదలిచాయి. క్వాడ్‌ ప్లస్‌ పేరుతో అమెరికా ఇప్పటికే వియత్నాం, న్యూజిలాండ్‌, దక్షిణ కొరియాలను కలుపుకొని పోతోంది. కొవిడ్‌వల్ల విచ్ఛిన్నమైన ఆర్థిక వ్యవస్థలను మళ్లీ పట్టాలెక్కించడానికీ, ప్రత్యామ్నాయ సరఫరా గొలుసుల ఏర్పాటు గురించి ఈ ఏడాది మార్చిలో క్వాడ్‌, క్వాడ్‌ ప్లస్‌ దేశాలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించాయి. రెండో క్వాడ్‌ ప్లస్‌ సమావేశంలో ఇజ్రాయెల్‌, బ్రెజిల్‌ పాలుపంచుకుని కొవిడ్‌ టీకాలు, ఆరోగ్య సంరక్షణ టెక్నాలజీల గురించి చర్చించాయి. క్వాడ్‌ ప్లస్‌ మార్గంలో మరిన్ని ఆసియాన్‌ సభ్యదేశాలను భాగస్వాముల్ని చేసుకోవాలి. చైనా ఉత్తరోత్రా తన కబ్జాకోరు విధానాలను విడనాడితే ఆ దేశాన్ని కూడా కలుపుకొని వెళ్లవచ్చు. కానీ, తాజాగా తైవాన్‌ మీద యుద్ధ భేరి మోగిస్తున్న చైనా తన దుందుడుకు పంథా విడనాడుతుందనుకోవడం అత్యాశే కావచ్చు.

- కైజర్‌ అడపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.