శాస్త్రీయ ప్రచురణల విషయంలో గత పదేళ్లలో భారత్లో గణనీయ పురోగతి చోటుచేసుకుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ శుక్రవారం తెలిపింది. ఈ అంశంలో చైనా, అమెరికా తర్వాత మన దేశం మూడో స్థానంలో ఉందని పేర్కొంది. 2018లో మన దేశం నుంచి 1,35,788 పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయని వివరించింది.
ఈ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..
- 2017-18లో ప్రపంచవ్యాప్తంగా లభించిన 13,045 పేటెంట్లలో 1937 పేటెంట్లు భారతీయులవే. ఈ కాలంలో మొత్తం 15,550 పేటెంట్ల కోసం భారతీయులు దరఖాస్తు చేశారు. వీటిలో 65 శాతం మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, దిల్లీ నుంచి దాఖలయ్యాయి.
- పరిశోధన, అభివృద్ధి అంశంలో జాతీయ పెట్టుబడులు 2017-18లో రూ.1,13,825 కోట్లు ఉండగా 2018-19 నాటికి అది రూ.1,23,847 కోట్లకు పెరిగాయి.
- నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన 'నిధి' వంటి కార్యక్రమాల వల్ల కూడా పరిస్థితి మెరుగుపడింది. దీనివల్ల గత ఐదేళ్లలో 65,884 ఉద్యోగాలు, ఆర్థిక సంపద రూపంలో రూ.27,262 కోట్లు లభించాయి.
- పరిశోధన పత్రాల ప్రచురణ విషయంలో భారత వృద్ధి 12.9 శాతంగా ఉంది. ప్రపంచ సరాసరి 4.9 శాతమే. 2008-18 మధ్య కాలంలో భారత్లో 10.7 శాతం వృద్ధి రేటు ఉంది. ఆ పదేళ్లలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సరాసరి వృద్ధి రేటు. ఆ కాలంలో చైనాలో ఇది 7.81 శాతంగా, అమెరికాలో 0.71 శాతంగా ఉంది.