2004, 2009 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పలు తప్పుడు హామీలు ఇచ్చిందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. వీటిని హస్తం పార్టీ విస్మరించినప్పటికీ... భాజపా ప్రభుత్వం నెరవేర్చినట్లు తెలిపారు రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్.
కాంగ్రెస్ పార్టీకి ఉన్న అసహన వైఖరి ప్రస్తుతం స్పష్టమైంది. తప్పుడు హామీలు, మాటలు చెబుతూ దేశ ప్రజలను ఎల్లవేళలా మోసం చేయలేరు. ప్రజలకు అన్నీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రకటనలతో వారు మోసపోరు. - పియూష్ గోయల్, రైల్వే మంత్రి
కాంగ్రెస్ పార్టీ 2004, 2009 ఎన్నికల హామీల్లో నెరవేర్చని వాటిని విశదీకరించారు పియూష్ గోయల్. వీటిని ఐదు సంవత్సరాల్లో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తి చేసినట్లు తెలిపారు.
రైతుల ఆదాయం
రైతులకు ప్రత్యక్ష ఆదాయం అందిస్తామని 2004,2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని, కానీ 10 సంవత్సరాల్లో అమలు చేయలేకపోయిందన్నారు గోయల్. మోదీ ప్రభుత్వం రూ.6వేల రూపాయలను రైతుల ఖాతాలో వేస్తుందని తెలిపారు.
విద్యుత్ సౌకర్యం
ప్రతీ ఇంటికి విద్యుత్ సౌకర్యం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు తెలిపారు గోయల్. 3 నుంచి 5 ఏళ్లలో దీన్ని సాధిస్తామని అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆ సమయంలో ప్రకటించారని.... 2009 ఎన్నికల్లోనూ ఆ హామీనే ఇచ్చినట్ల గుర్తుచేశారు. కానీ భాజపా ప్రభుత్వం వచ్చే నాటికి 18వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదని, ఇప్పుడు ఆ సమస్య లేకుండా చేశామని స్పష్టం చేశారు గోయల్.
ఉగ్రవాదం
ఉగ్రవాద చర్యలను సహించబోమని గత మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినట్లు తెలిపారు పియూష్ గోయల్. కానీ కసబ్ లాంటి ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధించటం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నచ్చట్లేదని ఆరోపించారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉగ్రవాదులకు మద్దతిస్తున్నదో దేశం మొత్తం చూస్తోంది. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడు... కాంగ్రెస్, మిత్ర పక్షాలు, పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు తీవ్రవాదులకు మద్దతిస్తున్నారు. మన దేశం, సైన్యాన్ని బలహీనపరచేందుకు ఉగ్రవాదులకు మద్దతిస్తున్న దేశాల టీవీల్లో వీళ్ల ప్రసంగాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదుల విషయంలో ఏ విధంగా ఉదాసీనంగా వ్యవహరించిందో తెలుసుకోవటానికి ఉదాహరణే పోటా చట్టాన్ని(ఉగ్రవాద నిర్మూలన చట్టం) తొలగించటం.
- పియూష్ గోయల్, రైల్వే మంత్రి.
ఆర్థికంగా వెనుకబడిన తరగతులు
ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించప్పటికీ నెరవేర్చలేదని పియూష్ గోయల్ అన్నారు. తమ పార్టీనే ఈ హామీని నెరవేర్చిందని తెలిపారు.
ఒకే ర్యాంకు, ఒకే పింఛను
సైనికోద్యోగులకు ఒకే ర్యాంకు, ఒకే పింఛను హామీని కాంగ్రెస్ పార్టీ విస్మరించినప్పటికీ తమ ప్రభుత్వమే అమలు చేసిందని తెలిపారు.
అవినీతి నిర్మూలన
అవినీతిని కూకటివేళ్లతో సహా పెకిలిస్తామని, నల్లధన సృష్టి జరగకుండా చర్యలు తీసుకుంటామని 2004లో కాంగ్రెస్ హామీలు గుప్పించిందని గోయల్ తెలిపారు. అగస్టా వెస్ట్ల్యాండ్, కామన్వెల్త్, 2జీ లాంటి కుంభకోణాలు ఆ పార్టీ హయాంలో జరిగాయని గుర్తు చేశారు పియూష్. మోదీ ప్రభుత్వం నల్లధనంతో పాటు అవినీతి లేకుండా చేసిందని ప్రకటించారు. చట్ట పరమైన చర్యలతో చాలా మందిని రుణాలు కట్టే విధంగా చేశామని తెలిపారు.
జీఎస్టీ
ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే చర్యలు తీసుకుంటామని, వస్తుసేవల పన్ను(జీఎస్టీ)ని అమలు చేస్తామని 2009లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లు తెలిపారు గోయల్. ఆ ఎన్నికల్లో గెలిచాక కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ మెరుగవటం బదులు వృద్ధి రేటు పడిపోయిందని, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు పెరిగాయని, ద్రవ్య లోటు 6.5 శాతానికి చేరిందని ఎద్దేవా చేశారు.
అంతర్జాలం
మూడు సంవత్సరాల్లో దేశమంతా బ్రాండ్బ్యాండ్ సౌకర్యాన్ని తీసుకొస్తామని 2009లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని... 2014 వరకు కేవలం 59 గ్రామాలకు మాత్రమే అంతర్జాలం చేరిందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం 1.2 లక్షల గ్రామాలకు ఈ సౌకర్యాన్ని అందించినట్లు ప్రకటించారు పియూష్ గోయల్.