దిల్లీని దట్టమైన పొగమంచు కప్పేసింది. సూర్యుడు కనిపించే పరిస్థితులు లేవు. వెలుతురు లేమి కారణంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. పలు రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
మూడు విమానాల దారి మళ్లింపు..
దట్టమైన పొగమంచు కారణంగా మూడు విమానాలను దారి మళ్లించారు అధికారులు. రన్వే వెలుతురు పరిమితి 50-175 మీటర్ల మధ్య ఉండే క్యాట్-3బి పరిస్థితుల్లోనే విమానాల రాకపోకలు సాగిస్తున్నారు. అయితే.. ఏ విమాన సర్వీసును రద్దు చేయలేదని.. ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం అందిస్తున్నట్లు వెల్లడించారు అధికారులు.
ఆలస్యంగా 30 రైళ్లు..
పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని దిల్లీ రైల్వే స్టేషన్ అధికారులు వెల్లడించారు.
గాలి నాణ్యతపై ప్రభావం...
దిల్లీలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది. ఆనంద్ విహార్ ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ)లో 462 పాయింట్లగా నమోదైంది. ఓఖ్లా ఫేస్-2లో అత్యధికంగా 494గా ఉండి గాలి నాణ్యతపై ఆందోళన కలిగిస్తోంది.
పడిపోతున్న ఉష్ణోగ్రతలు..
దిల్లీలో ఉష్ణోగ్రతలు నానాటికీ రికార్డ్ స్థాయిలో పడిపోతున్నాయి. హస్తినలో ఆదివారం 2.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. చలి తీవ్రతపై వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. రేపటి నుంచి నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్, ఫిరదాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
రోడ్లపై చలిలో పడుకున్న వారిని ఆనంద్ విహార్లోని శిబిరాలకు తరలించారు అధికారులు. నగరంలో చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఈ పరిస్థితి జనవరి 3 వరకు కొనసాగే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది.
ఇదీ చూడండి: దిల్లీని వణికిస్తోన్న చలిపులి.. అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు