సంకల్పానికి వయస్సు అడ్డంకి కాదని నిరూపించాడు తమిళనాడుకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడు. చెన్నైలో కేసుల వ్యాప్తి.. ఒకరికొకరు సంబంధం లేకుండా ఉండే నగర వాతావరణంలో ఇమడలేక.. లాక్డౌన్ కారణంగా ఇంటికి వెళ్లలేక సతమతమయ్యాడు. ఎలాగైనా స్వగ్రామానికి వెళ్లిపోవాలని సంకల్పించి.. మనవడి సైకిలేసుకుని చెప్పాపెట్టకుండా ఊరికి పయనమయ్యాడు.
5 రోజుల్లోనే..
తమిళనాడు తిరునల్వేలీ జిల్లా తీవనాయగపెరిలోని సుదాలై మాదన్కు చెందిన 75 ఏళ్ల పాండియన్.. కేరళ చంగనచెర్రీ లోని ఓ హోటల్లో పనిచేస్తుండేవాడు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో ఉన్న మనవడిని చూసేందుకు చెన్నైకి వెళ్లాడు. కొద్దిరోజులకే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అక్కడ ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో నగరంలో చిక్కుకుపోయాడు. నగర జీవనంపై విసుగెత్తిన పాండియన్ ఇంట్లో చెప్పకుండా సైకిల్పై సుదీర్ఘ ప్రయాణం చేశాడు. 5 రోజుల పాటు సైకిల్పై ప్రయాణించి 650 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి చేరాడు. అనంతరం ఊర్లోని ఆలయంలో 15 రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉన్నాడు పాండియన్. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న ఈ సాహస వీరుడి ప్రయాణం గురించి గ్రామంలోనే కాక చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: ఆరేళ్ల బాలుడు ఆస్పత్రిలో స్ట్రెచర్ తోస్తూ...