బిహార్లో మిత్రపక్షాలైన భాజపా, జేడీయూ మధ్య అసమ్మతి సెగలు కమ్ముకుంటున్నాయని భావిస్తున్న వేళ ..జన్ అధికార్ పార్టీ అధినేత పప్పూ యాదవ్ అసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భాజపా, ఆర్జేడీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాయని అన్నారు. నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి తనదైన వ్వక్తికి ఆ అధికారాన్ని భాజపా కట్టబెడుతుందని ఆరోపించారు.
నితీష్ కుమర్ మరో ఆరు నెలలే అధికారంలో ఉంటారని ఆ తర్వాత ప్రతిపక్షనాయకుడు తేజస్వీ యాదవ్ సీఎంగా కొనసాగుతారని జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ చేసిన వ్యాఖ్యలను పప్పూ యాదవ్ గుర్తుచేశారు. బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో ఒక్క భాజపాకే 74 సీట్లు వచ్చాయి. జేడీయూకు 43 సీట్లే వచ్చాయి. ఎక్కువ సీట్లు సాధించిన భాజపా తన అభ్యర్థిని సీఎంగా ఎందుకు నియమించకూడదని యాదవ్ అన్నారు.
"బిహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఐదేళ్లు పాలన సాగిస్తుందని భాజపా నమ్మబలుకుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. స్నేహితులుగా చెప్పుకుంటున్న భాజపా, జేడీయూ మధ్య అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, అతని కుటుంబం స్కామ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో భాజపాతో కలిసే అవకాశాలు లేకపోలేదు."
పప్పూ యాదవ్, జన్ అధికార్ పార్టీ అధినేత
నితీష్ అందుకే సంతోషంగా లేరు..
బిహార్ ఎన్నికల్లో కీలక స్థానాలను గెలుచుకుని జేడీయూకు భాజపా పెద్దన్నగా తయారయిందని పప్పూ యాదవ్ అన్నారు. స్పీకర్, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను తన మనిషులనే భాజపా నియమించుకుందని పేర్కొన్నారు. నితీష్ కుమార్ సన్నిహితుడైన సుశీల్ కుమార్ మోదీని రాజ్యసభకు పంపింది. ముఖ్యమైన పదవులను తన చేతిలో ఉంచుకుని రాష్ట్ర క్యాబినెట్ విస్తరించకుండా భాజపా అడ్డుకుంటోందని యాదవ్ ఆరోపించారు. ఇందువల్లనే నితీష్ సంతోషంగా లేరని అన్నారు.
ఇదీ చదవండి:'వారిని ఉపఎన్నికల్లో పోటీచేయనీయొద్దు'