కన్నతల్లినే అత్యంత దారుణంగా హత్యచేసి ప్రియుడితో పరారైన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. అంతేకాదు ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ప్రియుడితో కలిసి అండమాన్కు పరారైంది ఓ ఇంజినీర్. పక్కా పథకం ప్రకారమే అమృత ఈ హత్య చేసినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. మూడు రోజుల పాటు గాలించిన అనంతరం పోలీసులు అమృతతో పాటు ప్రియుడు శ్రీధర్ రావుని అండమాన్లో అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన అమృత(33) సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తోంది. 2017 వరకు రెగ్యులర్గా పనిచేసిన అమృత, కుటుంబ సమస్యలతో ప్రస్తుతం ఇంటి దగ్గర నుంచే తాత్కాలికంగా పనిచేస్తోంది. తన కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా అప్పుల్లో కూరుకుపోయిందని పోలీసులకు తెలిపింది అమృత.
అప్పుల వల్లే అమ్మను చంపేశా
తండ్రి ఊపిరితిత్తుల కాన్సర్ కారణంగా అమృత కుటుంబం అప్పుల్లో కూరుకుపోయింది. వీటన్నింటినుంచి బయటపడేందుకు తన తల్లి, సోదరుడిని హత్య చేసి చివరకు తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని ఆమె భావించింది. ఫిబ్రవరి 2వ తేదీ తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో అమృత తన తల్లి నిర్మల(52)ను వంటిట్లో ఉన్న కత్తితో దారుణంగా పొడిచింది.
ఆ సమయంలో అలజడికి నిద్రలేచిన సోదరుడిని కూడా అదే కత్తితో పొడిచింది. అనంతరం తల్లీ, సోదరుడు చనిపోయారని భావించి తన బ్యాగుతో బయటకు వెళ్ళింది. అప్పటికే ఇంటి బయట బైక్పై సిద్ధంగా ఉన్న ప్రియుడు శ్రీధర్రావుతో కలిసి నేరుగా ఎయిర్పోర్టుకు చేరుకొంది. ఆ బైక్ను అక్కడే వదిలేసి..ముందుగానే బుక్ చేసుకున్న విమానంలో పోర్ట్బ్లెయిర్కు పారిపోయారు. అక్కడే ఐదు రోజులపాటు గడిపేవిధంగా ప్లాన్ చేసుకున్నారు. అయితే, ఈ దాడిలో అమృత తల్లి అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన ఆమె సోదరుడు సమీపంలోని తమ బంధువులకు ఫోన్ చేసి ప్రాణాలు దక్కించుకొన్నాడు.
ప్రియుడికి తెలుసా?
తన ప్రియుడికి ముందుగానే ఇచ్చిన మాట ప్రకారం అండమాన్కు వెళ్ళానని అమృత పోలీసులకు చెప్పడం గమనార్హం. అయితే అమృత హత్య ప్లాన్ తన ప్రియుడికి తెలుసా? లేదా? అనే విషయం ఇంకా తేలలేదని పోలీసులు పేర్కొన్నారు. విచారణలో అమృత చెప్పిన విషయాలు ఇలా ఉండగా.. ఇవే కచ్చితమైన కారణాలు కాకపోవచ్చని.. మానసిక కారణాలు ఏవైనా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరిని బెంగళూరుకు తీసుకొచ్చి విచారణ జరిపాకే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు.
ఇదీ చదవండి:ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై.. చిన్నారులు సహా ఏడుగురు మృతి