కర్ణాటకలోని మండ్య, హాసన్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని కొందరు జేడీఎస్ నేతలు, సంబంధీకుల నివాసాలు, పరిశ్రమలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. మండ్య జిల్లా పరిషత్ అధ్యక్షుడు, జేడీఎస్ నేత నాగరత్న స్వామికి చెందిన రెండు ప్రదేశాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జడ్పీ సభ్యుడైన ఆదే పార్టీకి చెందిన మరో నాయకుడి ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు.
మండ్య, హాసన్ లోక్సభ నియోజకవర్గాల నుంచి మాజీ ప్రధాని దేవేగౌడ మనుమళ్లు నిఖిల్, ప్రజ్వల్ పోటీలో ఉన్నారు.
4 బృందాలు, 60 మంది అధికారులు
60 మంది ఐటీ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి బెంగళూరు, హాసన్, మండ్యలో 12 చోట్ల విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. వారికి సీఆర్పీఎఫ్ సిబ్బంది రక్షణగా వచ్చారు. పన్ను ఎగవేతకు పాల్పడి, నల్లధనం కూడబెట్టారనే సమాచారంతోనే సోదాలు చేస్తున్నామని ఐటీ అధికారులు చెబుతున్నారు.
"కొందరు వ్యాపార వేత్తలు పన్ను ఎగవేస్తున్నారని, అక్రమ ఆస్తులు కూడబెట్టారనే కచ్చితమైన సమాచారంతో సోదాలు చేస్తున్నాం. స్థిరాస్తి, గనులు, ప్రభుత్వ కాంట్రాక్టర్లు, పెట్రోల్ బంకుల నిర్వాహకులు, మిల్లులు నడుపుతున్న కొందరు వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నాం. ఈ రంగాల్లో నల్లధనం ఎక్కువగా చెలామణి అవుతోందని తెలుస్తోంది"
-- ఆదాయపు పన్ను శాఖ అధికారి
కక్షపూరితంగా కేంద్రం తమ పార్టీ నేతలపై ఐటీ దాడులు చేయిస్తోందని సీఎం కుమారస్వామి గత నెల 28న మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వరతో కలిసి ధర్నాకు దిగారు. ఈ అంశంపై జేడీఎస్-కాంగ్రెస్, భాజపా నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.
కర్ణాటకలోని 28 లోక్సభ స్థానాలకు రెండు దశల్లో ఈ నెల 18, 23 తేదీల్లో పోలింగ్ జరగనుంది.