నాలుగురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మహారాష్ట్ర అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలకు ఎటు చూసినా నీరే దర్శనమిస్తోంది. గోడలు కూలిన ఘటనలతో ఆ రాష్ట్రంలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం అర్ధరాత్రి ఒక డ్యామ్కు గండి పడిన ఘటన ఆ రాష్ట్ర పరిస్థితిని మరింత దయనీయంగా మార్చింది.
రత్నగిరి జిల్లా తివారే గ్రామంలో ఉందీ డ్యామ్. కుండపోత వర్షాలతో డ్యామ్కు గండిపడింది. ఉద్ధృతంగా ప్రవహించిన నీరు సమీపంలోని నివాసాలపై విరుచుకుపడింది. క్షణాల్లోనే అనేక మంది గల్లంతయ్యారు. నీటి ఉద్ధృతికి 12-15 ఇళ్లు కొట్టుకుపోయాయి. మరికొన్ని నివాసాలు బాగా దెబ్బతిన్నాయి.
అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 23 మృతదేహాలను వెలికితీశారు. మిగిలినవారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
బాధితుల రోదన..
ఘటన జరిగినప్పటి నుంచి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. బాధితుల రోదన వర్ణణాతీతం. తమ కుటుంబ సభ్యులను నిర్జీవంగా చూసిన ఏడ్చిన వారు కొందరైతే... నివాసాలు అదృశ్యమవడం వల్ల విలపించిన వారు మరికొందరు. ఇంకొందరు తమవారి ఆచూకీ కోసం ప్రార్థనలు చేశారు.
మహారాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 67 మంది మృత్యువాతపడ్డారు. అనేక మంది క్షతగాత్రులయ్యారు. ఎందరో సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: మహిళ కడుపు నుంచి 4కిలోల కణితి తొలిగింపు