కరోనా వేళ వైద్యులే దేవుళ్లన్న మాట నిజమే. కానీ, వందలాది ఆసుపత్రుల్లో.. అలాంటి దేవుళ్లు వేలాది మంది ఉన్నప్పటికీ.. సరైన వసతులు లేక ఓ నిండు చూలాలును కడుపు కోత నుంచి కాపాడలేకపోయారు. పురిటి నొప్పులతో.. ఆసుపత్రుల చుట్టూ తిరిగి తిరిగి ఆఖరికి ఆటోలో మృత శిశువుకు జన్మనిచ్చింది కర్ణాటకకు చెందిన ఓ మహిళ.
బెంగళూరు శ్రీరామపురకు చెందిన నెలలు నిండిన ఓ గర్భిణి.. ఆసుపత్రుల చుట్టూ తిరిగింది. శ్రీరామపుర ప్రభుత్వాసుపత్రి సహా.. విక్టోరియా, వాణి, విలాస ఆస్పత్రుల గడపలు తొక్కింది. ప్రసవ వేదనతో తల్లడిల్లుతున్న ఆ తల్లికి చికిత్స అందించేందుకు పడకలే లేవని ఒక్క ఆసుపత్రి కూడా చేర్చుకోలేదు. ఎనిమిది గంటల పాటు తిరిగాక.. చివరకు స్థానిక కే.సీ ఆసుపత్రికి వెళ్లింది. ఆసుపత్రిలో చేరేలోగా నొప్పులు తీవ్రమయ్యాయి. దీంతో వచ్చిన ఆటోలోనే బిడ్డను ప్రసవించింది. దురదృష్ట వశాత్తు ఆ బిడ్డ గర్భంలోనే తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.
ఓ వైపు ప్రసవ నొప్పులు, మరోవైపు బిడ్డను కోల్పోయానన్న దుఃఖంతో గుండెలు పగిలేలా ఏడ్చింది ఆ తల్లి.
ఈ మొత్తం వ్యవహారంపై మల్లేశ్వరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఇదీ చదవండి: ప్రైవేటులో చేర్చుకోరు... ప్రభుత్వ దవాఖానాల్లో చేరలేము!