బలవంతపు మత మార్పిళ్లను నిషేధిస్తూ ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టానికి తాజాగా 224 మంది ప్రముఖులు మద్దతు పలికారు. ఆ చట్టం మహిళల గౌరవానికి రక్షణ కల్పిస్తుందని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపై సంతకం చేసినవారిలో ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, హరియాణాల మాజీ ప్రధాన కార్యదర్శులు యోగేంద్ర నరైన్, సర్వేశ్ కౌశల్, ధరంవీర్లతోపాటు దిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేంద్ర మేనన్, మాజీ రాయబారి లక్ష్మీపురి, మహారాష్ట్ర మాజీ డీజీపీ ప్రవీణ్ దీక్షిత్ తదితరులున్నారు.
మైనార్టీలను రెచ్చగొట్టడమే..
ఈ చట్టం ముస్లిములకు వ్యతిరేకమంటూ విమర్శిస్తున్నవారిని వారు తప్పుపట్టారు. "మైనార్టీలను రెచ్చగొట్టడం ద్వారా మత విద్వేషాలను రేపేందుకు వివక్షపూరిత సమూహం చేస్తున్న యత్నం" అని వారు వ్యాఖ్యానించారు. ఆ చట్టం అందరికీ వర్తిస్తుందని అన్నారు. ప్రతి చట్టాన్ని న్యాయ సమీక్ష చేసే రాజ్యాంగ అధికారాన్ని విమర్శకులు తమ సొంత అభిప్రాయాల కోసం స్వాధీనం చేసుకున్నట్లు కనిపిస్తోందన్నారు. కాగా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొన్నిరోజుల క్రితం 104 మంది విశ్రాంత అధికారులు లేఖ రాసిన నేపథ్యంలో.. వీరు తాజా ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
సమాజ అవసరాల కోసమే..
భారత్లో మత సామరస్యాన్ని చాటిచెప్పే 'గంగ జమున' సంస్కృతి కుట్రతో చేసే మత మార్పిళ్లను అంగీకరించదని వారు అందులో పేర్కొన్నారు. లౌకిక భారత్పై తమకు విశ్వాసం ఉందని, అయితే దురుద్దేశంతో జరిపే మత మార్పిళ్లు మత సామరస్యానికి విఘాతం కలిగిస్తాయని నమ్ముతున్నామని చెప్పారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు శాంతి, భద్రతలు, సామాజిక సామరస్యం మహిళల గౌరవాన్ని కాపాడటానికి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ చట్టాన్ని విమర్శిస్తూ లేఖ రాసినవారు స్వాతంత్య్రం కన్నా ముందే కొన్ని సంస్థానాల్లో మత మార్పిళ్లకు వ్యతిరేకంగా చట్టాలు చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. స్వాతంత్య్రం తర్వాతా కొన్ని రాష్ట్రాలు ఈ తరహా చట్టాలు చేశాయన్నారు. మారుతున్న సమాజ అవసరాలకు తగ్గట్లు కొత్త చట్టాలు రూపొందుతాయని చెప్పారు.
ఇదీ చదవండి: నేర ముఠాల ఆటకట్టించేందుకు కృత్రిమ మేధ