దేశంలో కరోనా కేసులు తగ్గటం.. అవకాశాల కోసం తెరచుకున్న కిటీకీ అని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) డెరెక్టర్ డా.రణ్దీప్ గులేరియా పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పెద్ద స్థాయిలో కొనసాగడానికి పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) ఉండాలని అన్నారు. దిల్లీలో జరిగిన ఏఐఎంఏ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి, మరణాల సంఖ్యను తగ్గించేందుకు వ్యాక్సిన్ ఒక్కటే ప్రధాన ఆయుధమని తెలిపారు.
"కేసులు తగ్గుతున్నందున అవకాశాల కిటీకీ తెరుచుకుందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. కానీ, ఈ కిటీకీ ఎప్పుడైనా మూసుకుపోవచ్చు. ఇలాంటి ఘటనలు ప్రపంచ దేశాల్లో మనం చూస్తూనే ఉన్నాం. కొత్త రకం కరోనా వైరస్తో దేశాలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మనం ఇప్పుడు ఈ అవకాశాన్ని చేజార్చుకోకూడదు. దేశ పౌరులందరికీ పెద్ద సంఖ్యలో టీకా పంపిణీ చేసేందుకు ప్రయత్నించాలి. అప్పుడే కొవిడ్ నుంచి మనకు కాస్తయినా రక్షణ లభిస్తుంది. టీకా అందరికీ చేరాలంటే పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిని అభివృద్ధి చేయాలి."
-డా.రణ్దీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్.
ఆరోగ్య సంరక్షణ రంగాన్ని సేవా రంగంగా మాత్రమే పరిగణించకూడదని గులేరియా అభిప్రాయపడ్డారు. భారత్ అంటే వైద్య పరిశోధనలకు నిలయంగా మాత్రమే కాకుండా.. ప్రపంచ రోగుల సంరక్షణ నిలయంగా మారాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అపోలో వైస్ ఛైర్పర్సన్ ప్రీతారెడ్డి పాల్గొన్నారు. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆమె కొనియాడారు.