తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సీఎం అభ్యర్థిగా కే పళనిస్వామిని ఎన్నుకుంది అన్నాడీఎంకే. ఆయన నామినేషన్ను పార్టీ జనరల్ కౌన్సిల్ ధ్రువీకరించింది. ఎన్నికల పొత్తులపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని పళనిస్వామితో పాటు డిప్యూటీ సీఎం పనీర్సెల్వంకు కట్టబెడుతూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. సీట్ల పంపిణీ, ఎన్నికల వ్యూహాల విషయంలోనూ వీరిదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది.
2020 అక్టోబర్లో ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల స్టీరింగ్ కమిటీని సైతం జనరల్ కౌన్సిల్ ధ్రువీకరించింది. సీఎం పళనిస్వామిపై డీఎంకే అధినేత స్టాలిన్ చేసిన విమర్శలను ఖండిస్తూ తీర్మానాన్ని విడుదల చేసింది.
చెన్నై సమీపంలో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకుంది అన్నాడీఎంకే. సమావేశానికి పార్టీ ప్రెసిడియం ఛైర్మన్ ఈ మధుసూధనన్ అధ్యక్షత వహించారు.