Actor Vishal Censor Board : ముంబయిలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ)కి చెందిన కొందరు అధికారులపై హీరో విశాల్ చేసిన లంచం ఆరోపణల నేపథ్యంలో వారిపై గురువారం కేసు నమోదు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). సంబంధిత అధికారులతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొంతమందిపై కూడా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు సీబీఐ అధికారులు. ఇటీవలే విడుదలైన 'మార్క్ ఆంటోనీ' చిత్రానికి హిందీలో సెన్సార్ సర్టిఫికెట్ పొందేందుకు తాను రూ.6.5 లక్షలను సీబీఎఫ్సీ అధికారులకు లంచంగా ఇవ్వాల్సి వచ్చిందని తమిళ ప్రముఖ నటుడు విశాల్ సెప్టెంబర్ 29న సంచలన ఆరోపణలు చేస్తూ ట్విట్టర్ వేదికగా ఓ సంచలన పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది.
సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఉన్న ముగ్గురు ప్రైవేటు వ్యక్తుల్లో మెర్లిన్ మేనగా, జీజా రామ్దాస్, రాజన్ ఎం.తో పాటు సీబీఎఫ్సీకి చెందిన గుర్తుతెలియని ప్రభుత్వాధికారులు కూడా ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారి ఒకరు తెలిపారు. అంతకుముందు ఈ కేసుతో సంబంధమున్న నిందితులకు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ముంబయిలోని మొత్తం నాలుగు చోట్ల ఈ దాడులు జరిపారు. అనంతరం వారిపై కేసు నమోదు చేశారు.
రూ.6.54 లక్షలకు కుదిరిన బేరం!
హీరో విశాల్, ఎస్జే సూర్య నటించిన 'మార్క్ ఆంటోనీ' చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు అధికారులు కొందరు మూవీటీమ్ను రూ.7లక్షల లంచం డిమాండ్ చేశారని.. బేరసారాల తర్వాత చివరికి రూ.6.54లక్షలకు ఒప్పందం కుదిరిందని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.
లంచం కింద తీసుకున్న రూ.6.54 లక్షలను రెండు వేర్వేరు బ్యాంకు ఖాతాల ద్వారా అకౌంట్లలో మూవీటీమ్ జమ చేసిందని అధికారులు చెప్పారు. అనంతరం సెప్టెంబరు 26న హిందీలో డబ్ చేసిన 'మార్క్ ఆంటోనీ' మూవీకి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ను సీబీఎఫ్సీ జారీ చేసిందని సీబీఐ తెలిపింది. అయితే నిందితుల్లో ఒకరు అంగీకరించిన లంచానికి అదనంగా మరో రూ.20 వేల రూపాయలను కో-ఆర్డినేటింగ్ ఫీజు కింద తన బ్యాంకు ఖాతాలో వేయించుకున్నారని అధికారులు వివరించారు. కాగా, లంచంగా డిపాజిట్ చేసిన రూ.6.54 లక్షల నుంచి రూ.6.50 లక్షలను నిందితులు వెంటనే విత్డ్రా చేసినట్లుగా గుర్తించామని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.
'నా సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ పొందేందుకు సీబీఎఫ్సీ అధికారులు మొత్తం రూ.6 లక్షలను లంచంగా అడిగారు. ముందుగా స్క్రీనింగ్ కోసం రూ.3 లక్షలు చెల్లించమని అడిగారు. ఆ తరువాత సర్టిఫికేట్ కోసం రూ.3.5లక్షలు అవుతాయని చెప్పారు. ఇదేంది అని అడిగితే సీబీఎఫ్సీలో ఇది సాధారణమైన పద్ధతి అని సదరు మహిళా అధికారి నాతో అన్నారు. సెన్సార్ క్లియరెన్స్ పొందాలంటే సినిమా నిర్మాతలు కచ్చితంగా డబ్బులు కట్టాల్సిందే అని ఆమె నాతో అన్నారు' అని విశాల్ వివరాలతో సహా సెప్టెంబర్ 29న ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.
"అవినీతి అనేది సినిమాల్లో చూపిస్తే బాగుంటుంది. కానీ, నిజజీవితంలో కాదు. నా సినిమా విషయంలో జరిగిన ఈ తీరును నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ప్రభుత్వ కార్యాలయ్లాల్లో ముఖ్యంగా ముంబయిలోని సీబీఎఫ్సీ ఆఫీసులో ఈ దారుణం జరుగుతుంది."
- విశాల్ ట్వీట్
ప్రధాని, సీఎంకు విశాల్ అభ్యర్థన..
సీబీఎఫ్సీలో నడుస్తున్న అవినీతిని పరిశీలించాలని ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందేను కొద్దిరోజుల క్రితం అభ్యర్ధించారు విశాల్. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ స్పందిస్తూ వెంటనే ఈ ఆరోపణలపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.
Bhumi Pednekar Trolls : భూమి పెడ్నేకర్ వారికి గట్టి కౌంటర్.. ఇచ్చి పడేసిందిగా!
October OTT Release Movies 2023 : ఈ వారం స్పెషల్.. ఓటీటీల్లో విడుదలవనున్న సినిమాలు ఇవే!