రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా కేరళలోని ఎర్నాకుళంలో సోమవారం కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఫలితంగా ఆ ప్రాంతంలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. నటుడు జోజు జార్జ్.. ట్రాఫిక్లో రెండు గంటల పాటు చిక్కుకున్నారు. దీంతో సహనం కోల్పోయిన ఆయన కారు దిగి కాంగ్రెస్ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. సాధారణ పౌరులకు కష్టాలు తెచ్చిపెట్టే విధంగా నిరసనలు తెలపడం తగదని వారించారు. దీంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ కార్యకర్తలు.. జోజు కారు అద్దాన్ని పగలగొట్టారు.
![congress protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13519555_4.jpg)
'ఇంధన ధరలు పెంపు అనేది చాలా పెద్ద విషయం. అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ అంశంపై నిరసన తెలపాలి. కానీ ఈ విధంగా కాదు. ప్రజలకు కష్టమవుతోంది. ఆసుపత్రికి వెళ్లాల్సిన వారు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయారు,' అని జోజు భావోద్వేగంతో మీడియా ముందు మాట్లాడారు.
![congress protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13519555_1.jpg)
అయితే కాంగ్రెస్ వాదన మరో విధంగా ఉంది. జోజు మద్యం సేవించి మహిళా కార్యకర్తలతో దురుసగా మాట్లాడారని ఆరోపించింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకరన్ సైతం జోజుపై మండిపడ్డారు. మద్యం సేవించి 'గూండా'లా ప్రవర్తించారన్నారు. జోజుపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
![congress protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13519555_3.jpg)
ఘటన జరిగిన కొద్దిసేపటికి త్రిపునితుర ప్రాంతంలోని ఓ ఆసుపత్రికి వెళ్లిన జోజు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అందులో ఆయన మద్యం సేవించలేదని తేలింది. తాను గొడవలు కోరుకోవడం లేదని, ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ముగించాలని జోజు కోరారు. అయితే ఈ విధంగా నిరసనలు తెలపడం సరికాదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:- సామాన్యుడికి 'పెట్రో' సెగ - మళ్లీ పెరిగిన చమురు ధరలు