భారత్లో కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ సమయంలో 15 శాతం మంది వివాహితలు అవాంఛిత గర్భాలు దాల్చినట్లు ఓ సర్వేలో వెల్లడైంది. గర్భ నిరోధక మందులు అందుబాటులో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తేలింది. అలాగే 3.2 కోట్ల మంది ఆహార కొరతను ఎదుర్కొన్నట్లు నివేదిక పేర్కొంది.
ఈ మేరకు 'భారత్లోని తక్కువ ఆదాయ కుటుంబాల్లోని మహిళలపై కరోనా ప్రభావం' పేరుతో సామాజిక సలహా బృందం డాల్బెర్గ్ ఓ సర్వే నిర్వహించింది. బిహార్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఉత్తర్ప్రదేశ్, బంగాల్ రాష్ట్రాల్లో ఈ సర్వే జరిపింది. ఇందులో 15 వేల మంది మహిళలు, 2,300 మంది పురుషులు పాల్గొన్నారు. వారి పరిస్థితులు, సమస్యలపై రెండు విడతలుగా.. గతేడాది మార్చి 24 నుంచి మే 31 వరకు, అలాగే జూన్ నుంచి అక్టోబర్ వరకు డాల్బెర్గ్ సర్వే నిర్వహించింది.
సర్వేలోని మరిన్ని కీలకాంశాలు..
- లాక్డౌన్లో మహిళలు తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురయ్యారు. ప్రధానంగా రోజువారీ పని చేసిన వారు ఆర్థికంగా చితికిపోయారు.
- దేశంలో ప్రతి 10 మంది మహిళల్లో ఒకరి కంటే ఎక్కవ మంది ఆకలితో బాధపడ్డారు. అంటే దాదాపు 3.2 కోట్ల మంది మహిళలు తమ ఇళ్లలో ఆహార కొరతను ఎదుర్కొన్నారు.
- కరోనా సంక్షోభంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(1.2కోట్లు), జన్ధన్(10కోట్లు), ఉచిత రేషన్(18కోట్లు) వంటివి మహిళలకు అండగా నిలిచాయి.
- ప్రధానంగా 70 శాతం మంది ఆహారం, పోషకాల కోసం ప్రజాపంపిణీ వ్యవస్థ మీద ఆధారపడ్డారు.
- మహమ్మారి కారణంగా 16 శాతం మంది మహిళలకు శానిటరీ న్యాప్కిన్స్ అందుబాటులో లేవు.
- 15 శాతం వివాహిత మహిళలు గర్భ నిరోధక మందులను పొందలేకపోయారు. అలాగే కరోనా సమయంలో ఆరోగ్య సంరక్షణపై తీవ్ర ఆందోళన చెందారు.
- శానిటరీ న్యాప్కిన్స్, గర్భనిరోధక మందులను అందించే విషయంలో కేరళ, తెలంగాణ, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాలు బాగా పని చేశాయి. బిహార్ 49 శాతంతో చివరి స్థానంలో ఉంది. ఆ రెండు అందుబాటులో లేని మహిళల్లో కీలక ఆరోగ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
- గతేడాది ఏప్రిల్-మే నెలల మధ్య 4.3 కోట్ల మంది మహిళలు ఉపాధి/ఆదాయం కోల్పోయారు. కరోనాకు ముందు ఉద్యోగులైన 7.6 కోట్ల మందిలో 57శాతం మంది ఉపాధి కోల్పోయారు.
- 2020 సెప్టెంబరు-అక్టోబర్ నాటికి నలుగురు మహిళల్లో ఒకరికి (6.4 కోట్ల మంది మహిళలు) చేసిన పనికి చెల్లింపులు జరగలేదు. మహమ్మారికి ముందు పనిచేసిన 87 లక్షల మంది మహిళలు 2020 అక్టోబర్ నాటికి ఉపాధి కోల్పోయారు.
- అలాగే చెల్లింపుల విషయంలో పురుషులతో పోల్చుకుంటే మహిళలు జీతభత్యాలు నెమ్మదిగా పొందుతున్నారు. జీతాలు చెల్లించని మహిళలు 43 శాతం ఉంటే.. పురుషులు 35 శాతమే ఉన్నారు. మహమ్మారికి ముందు 24 శాతం మంది మహిళలు పని చేసేవారు. కరోనా కారణంగా వారిలో 28 శాతం మంది ఉపాధి కోల్పోయారు.
ఇదీ చూడండి: ఈ యాప్స్ వాడుతున్నారా.. అయితే మోసపోయినట్టే!