383 Years Sentenced For Former TNSTC Employee : అక్రమ పత్రాలు సృష్టించి మోసం చేసిన కేసులో ఓ వ్యక్తికి 383 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది తమిళనాడులోని కోయంబత్తూర్ న్యాయస్థానం. దీంతో పాటు రూ. 3.32 కోట్ల జరిమానాను విధించింది. ఒకవేళ ఫైన్ చెల్లించకపోతే అదనంగా మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది.
కేసు ఇదీ..
తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని కోయంబత్తూర్ డివిజన్లో బస్సుల వేలంలో అక్రమాలు జరిగాయంటూ 1988 నవంబర్ 9న ఫిర్యాదు నమోదైంది. సంస్థకు చెందిన 47 బస్సులను అక్రమ పత్రాలు సృష్టించి విక్రయించారంటూ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. అక్రమ పత్రాలతో సుమారు రూ.28 లక్షలు మోసం చేశారంటూ 8 మంది ఉద్యోగులపై ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చేరన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అసిస్టెంట్ కోదండపాణి, డిప్యూటీ మేనేజర్ రామచంద్రన్, నాగరాజన్, నటరాజన్, మురుగనాథన్, దురైసామీ, రంగనాథన్, రాజేంద్రన్ను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఈ కేసు కోయంబత్తూర్ ఫస్ట్ అడిషనల్ సబార్డినేట్ కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే కేసు విచారణ జరుగుతుండగానే రామచంద్రన్, నటరాజన్, రంగనాథన్, రాజేంద్రన్ మృతిచెందారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి తీర్పును శుక్రవారం వెలువరించింది న్యాయస్థానం. కోదండపాణి మినహా మిగిలిన ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేస్తూ తీర్పునిచ్చారు జడ్జి శివకుమార్.
![383 Years Sentenced For Former TNSTC Employee](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-07-2023/19125791_thumbnail_16x9_prision_2907newsroom_1690600239_953.png)
ఈ కేసులో కోదండపాణిని మూడు సెక్షన్ల కింద దోషిగా తేల్చింది కోర్టు. సంస్థను మోసం చేసినందుకు 47 నేరాల కింద 4 ఏళ్ల చొప్పున 188 ఏళ్లు, 47 ఫోర్జరీ నేరాలకు గాను 4 ఏళ్ల చొప్పున 188 ఏళ్లు, ప్రభుత్వ ఆస్తులను అపహరించినందుకు ఏడు సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఈ మూడు శిక్షల మొత్తం కలిపితే 383 సంవత్సరాలు అవుతుంది. దోషి వయసును దృష్టిలో పెట్టుకుని శిక్షను ఏకకాలంలో పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో పాటు రూ.3.32 కోట్ల జరిమానాను విధించింది. ఒకవేళ ఫైన్ చెల్లించకపోతే మరో ఏడాది జైలు శిక్ష అదనంగా వేయాలని తీర్పునిచ్చింది.
28 ఏళ్ల నాటి కేసులో తాజాగా తీర్పు
ఉత్తర్ప్రదేశ్లోని వారాణాసి కోర్టు సైతం ఇదే తరహాలో 28 ఏళ్ల నాటి కేసులో తాజాగా శిక్షను విధించింది. అవినీతి కేసులో ఓ మాజీ ప్రభుత్వ ఉద్యోగికి 10 ఏళ్ల జైలు శిక్షను విధించింది న్యాయస్థానం. ఇందిరా అవాస్ నిర్మాణ్ సమితిలోని బలియా డివిజన్లో పనిచేసే కైలాశ్ సింగ్ 1987-88, 88-89 ఆర్థిక సంవత్సరాల్లో అవినీతికి పాల్పడ్డాడు. రోడ్లు, మురుగు కాలువలు, మరుగుదొడ్ల నిర్మాణంలో అక్రమాలు చేశాడు. పనులు అసంపూర్తిగా ఉన్నా.. పూర్తైపోయాయంటూ బిల్లులు కాజేశాడు కైలాశ్. దీనిపై 1995 మే 23 న పోలీసులకు ఫిర్యాదు చేశారు విజిలెన్స్ అధికారులు. అప్పటి నుంచి కోర్టులో ఉన్న కేసుపై తాజాగా తీర్పు వచ్చింది.
ఇవీ చదవండి : 10 ఏళ్ల బాలుడి హత్య.. 29 ఏళ్ల తర్వాత తీర్పు.. దోషికి జీవిత ఖైదు
అతడికి మరణదండన, 92ఏళ్లు జైలుశిక్ష.. బాలుడ్ని చంపి, బాలికను రేప్ చేసిన కేసులో తీర్పు