By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 29, 2023, 10:51 PM IST
YSRCP Activists Attacked on TDP Supporters: పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు.. టీడీపీ కార్యకర్తలపై కత్తులు, సీసాలతో దాడి
YSRCP Cadres Attacked on TDP Supporters in Palnadu District: పల్నాడు జిల్లాలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనలో వైసీపీకి చెందినవారు.. టీడీపీ వర్గీయులపై చేతికి ఏది దొరికితే దానితో దాడి చేశారు. అంతటితో ఆగకుండా టీడీపీకి చెందిన వారి ఇళ్లపై కూడా దాడికి దిగారు. పోలీసులకు సమాచారం అందించినా.. స్పందించలేదని బాధితులు వాపోయారు.
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గొట్టిపాళ్ల గ్రామంలో సత్తెమ్మె కొలువులు నిర్వహిస్తున్నారు. ఈ కొలువులకు మొక్కులు చెల్లించుకునేందుకు టీడీపీ మద్దతుదారులు వెళ్తున్నారు. సంబరాలతో ఉత్సాహంగా మొక్కులకు వెళ్తూ.. కుంకుమ చల్లుకుంటున్నారు. కుంకుమ అక్కడే ఉన్న వైసీపీ మద్దతుదారులపై పడింది. దీంతో అగ్రహించిన వైసీపీ మద్దతుదారులు.. టీడీపీ కార్యకర్తలతో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో వైసీపీ నేత రవీంద్రకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వైసీపీ మద్దుతుదారులు భారీగా అక్కడికి చేరుకుని.. టీడీపీ మద్దతుదారులను దొరికిన వారిని దొరికినట్లుగా చావబాదారు. కర్రలు, కత్తులు, సీసాలు ఏది దొరికితే వాటితో దాడులకు తెగబడ్డారు. టీడీపీ నేత బాబుపై గొడ్డలితో దాడి చేయగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అంతటితో ఆగకుండా టీడీపీ మద్దతుదారుల ఇళ్లపైనా దాడి చేశారు. గంటకు పైగా ఈ ఉద్రిక్త పరిస్థితులు గ్రామంలో కొనసాగాయి.