వైసీపీ ప్రభుత్వం వాల్మీకీలను మభ్యపెట్టి మోసం చేసింది - టీడీపీ హయాంలోనే అపార అవకాశాలు : పూల నాగరాజు - సీఎం జగన్పై టీడీపీ వాల్మీకి నేతలు ఫైర్
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 5, 2023, 7:00 PM IST
TDP Valmiki Leaders fires on CM Jagan: ఎన్నికల లబ్ధి కోసమే వైసీపీ ప్రభుత్వం వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చే అంశాన్ని తెరపైకి తెచ్చిందని టీడీపీ వాల్మీకి సాధికారత రాష్ట్ర కన్వీనర్ పూల నాగరాజు అన్నారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం వాల్మీకీలను మభ్యపెట్టి మోసం చేసిందన్నారు. ఎస్టీలలో చేరుస్తామనే అంశంపై కల్లిబొల్లి మాటలు చెప్పిందన్నారు. వాల్మీకీలను ఎస్టీలుగా గుర్తించేది రాబోయే టీడీపీ ప్రభుత్వమేనని ఆయన చెప్పారు.
వాల్మీకి సాధికారత ఆధ్వర్యంలో 63 మండలాల్లో.. వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం వాల్మీకీలకు ఏం చేసింది.. ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసింది అనే అంశంపై చైతన్య కార్యక్రమాలు చేపడతామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో మొదటి పూజ వాల్మీకీలకు అవకాశం కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే వాల్మీకీలకు అన్ని అవకాశాలు కల్పించేలా చర్యలు చేపడతామన్నారు.
TAGGED:
Tdp valmiki on ycp