Atchannaidu on YCP Attacks: వైఎస్సార్సీపీ నేతలకు అచ్చెన్నాయుడు వార్నింగ్.. ఎన్నికల తర్వాత...!
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-07-2023/640-480-19017318-88-19017318-1689565927409.jpg)
Atchannaidu Fires on YSRCP: జగన్రెడ్డి రాష్ట్రంలో రౌడీయిజాన్ని చట్టబద్ధం చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అక్రమాలను వెలికితీసిన వారిపై ఆ పార్టీ గూండాలు దాడులకు తెగబడటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్రమాలు బహిరంగం చేశారని.. టీడీపీ నేత చదలవాడ అరవిందబాబు, కార్యకర్తలపై దాడికి పాల్పడడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. మరో వైపు చిత్తూరు జిల్లాలో ఇసుక మాఫియాను ప్రశ్నించిన టీడీపీ నేతలపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు దాడులు చేశారని దుయ్యబట్టారు. పట్టపగలే వైఎస్సార్సీపీ గూండాలు బరితెగించి వ్యవహరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్రెడ్డి రౌడీ పాలనకు పుల్ స్టాప్ పడే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. అధికారం ఉంది కదా అని బరితెగించి వ్యవహరిస్తున్న వైఎస్సార్సీపీ నేతలకు ఎన్నికల తర్వాత బడిత పూజ ఖాయమన్నారు.