TDP Anitha On Rushikonda : జనం సొమ్ముతో జగన్ విలాసాలు.. విశాఖను దోచేందుకే రుషికొండపై మకాం: అనిత, సంధ్యారాణి
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 20, 2023, 7:39 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-10-2023/640-480-19818574-thumbnail-16x9-tdp-anitha-on-rushikonda.jpg)
TDP Anitha On Rushikonda : రుషికొండపై కూర్చుంటే విశాఖ మొత్తం తన కాళ్ల కింద ఉండేలా విలాసవంతమైన భవనాన్ని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకుంటున్నారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. జనం సొమ్ముతో లక్షలాది రూపాయల కమోడ్లు, బాత్ రూం టబ్ల విలాసాలు ప్రజలంతా గమనిస్తున్నారని మండిపడ్డారు. జగన్, భారతీ మాత్రమే ఉండే ఆ ఇంటికి 400కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారంటే, ఏదో రూపేణా ఆ భవనాన్ని కాజేస్తారని ఆరోపించారు.
భవనంలో మహా అయితే ఒక గది సజ్జల సెటిల్మెంట్కి, మరో గది అవినీతి సొమ్ము లెక్కించేందుకు విజయసాయి ఉంటారని ఆక్షేపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పరిపాలన చేయమంటే, విశాఖ వచ్చి దోచుకుంటానని జగన్మోహన్ రెడ్డి అంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి ధ్వజమెత్తారు. ఆస్తి కూడబెట్టుకోవటం, ఇళ్లు కట్టుకోవటం, అవినీతి చేయటం తప్ప.. జగన్మోహన్ రెడ్డి ఏ మాట నిలబెట్టుకున్నాడని ఆమె నిలదీశారు. ఏదో రూపేణా రుషికొండ భవనం తన పేరున రాయించుకునేందుకు జగన్ రెడ్డి కుట్ర పన్నారని దుయ్యబట్టారు.