ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే ఏం చేయాలి ?
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 9, 2024, 9:33 PM IST
Prathidwani: భారతదేశానికి ఊపిరి ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు పారదర్శక ఎన్నికలు. నిష్పాక్షిక ఎన్నికలకు ఆధారం ఓటర్ల జాబితా. మొత్తం ఈ ప్రక్రియకే గ్రహణం పట్టించింది అధికార వైఎసీపీ. ఇలాంటి దుశ్చర్యలను చీల్చి చెండాడడానికి టీఎన్ శేషన్లు, కేజే రావులు ఇప్పుడు లేరు. కళ్లుండి చూడలేని, చెవులుండి వినలేని స్థితిలో ఏపీలో ఎన్నికల సంఘం ఉంది. అందుకే ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు మా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి మహాప్రభో అంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. 3 రోజుల పర్యటన కోసం సీఈసీ పెద్దలు అమరావతి చేరారు. ఆంధ్రాలో అకృత్యాలను క్యూ కట్టి మరీ విపక్షాల వారు వినిపిస్తున్నారు.
కోనేరు సురేష్ అనే వ్యక్తి పది లక్షలకు పై చిలుకు ఓట్లు బోగస్ అని సీఈవోకి ఫిర్యాదు ఇచ్చాడు. ఒక వ్యక్తికి బోగస్ ఓట్లు ఉన్నాయని ఎలా తెలుస్తుంది? కాబట్టి అతని మీదే చర్యలు తీసుకోవాలని సీఈసీకి వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కంప్లయింట్ ఇవ్వటం హాస్యాస్పదంగా అనిపించట్లేదా? ఎలక్షన్ కమిషన్ ఏపీలో సరిదిద్దాల్సిన లోటుపాట్లు ఏవి? ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే ఏం చేయాలి? ఇదీ నేటి ప్రతిధ్వని.