సముద్ర తీరంలో అలల తాకిడి - ముగ్గురు సీఏ విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 19, 2023, 12:38 PM IST
|Updated : Dec 19, 2023, 1:22 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-12-2023/640-480-20302964-thumbnail-16x9-police-rescued-three-students-drowning-in-the-sea.jpg)
Police Rescued Three Students Drowning In The Sea: విహారయాత్రకు వచ్చిన విద్యార్థులకు ఊహించని ప్రమాదం ఎదురైంది. పోలీసులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. బాపట్ల జిల్లా సూర్యలంక తీరం వద్ద సముద్రంలో అలల తాకిడికి కొట్టుకుపోతున్న ముగ్గురు విద్యార్థులను పోలీసులు, గజఈతగాళ్లు రక్షించారు. బీచ్ వద్ద నీటిలో దిగి విద్యార్థులు స్నానం చేస్తుండగా ఒక్కసారిగా పెద్దగా అలలు రావడంతో అకస్మాత్తుగా సుడి ఏర్పడింది. సుడిగాలి, అలల తాకిడికి ఇద్దరు విద్యార్థులు, ఓ విద్యార్థిని సముద్రం లోపలికి కొట్టుకుపోయారు. సముద్రంలో మునిగిపోతున్న వారిని చూసి తోటి విద్యార్థులు గట్టిగా కేకలు వేశారు.
బీచ్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఉన్న పోలీసులు, గజఈతగాళ్లు స్పందించి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. సముద్రంలోకి కొట్టుకుపోతున్న వారిని చూసి వెంటనే ఈదుకుంటూ వెళ్లి నీటిలో మునిగిపోతున్న ముగ్గురు విద్యార్థులను కాపాడి క్షేమంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరులోని ఓ కళాశాలలో సీఏ చదువుతున్న విద్యార్థులు సూర్యలంక తీరంలో విహారానికి వచ్చారని తెలిపారు.