నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జనసేన జెండా ఎగురవేస్తా: పవన్ కల్యాణ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 2, 2023, 7:55 PM IST
|Updated : Dec 2, 2023, 8:19 PM IST
Pawan Kalyan allegations on Jagan: ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే పొత్తులకు వెళ్తున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. విడివిడిగా పోటీ చేస్తే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని అన్నారు. అణగారిన కులాలకు అధికారం చూడని కులాలకు సాధికారత రావాలన్నదే జనసేన లక్ష్యమని తెలిపారు. ఎదగడమంటే ఇంకో కులాన్ని తగ్గించడం కాదన్న పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ పెట్టినప్పుడు మాట మీద నిలబడకపోవడం వల్ల అవమానాలు ఎదుర్కొన్నాం కాని వ్యవస్థాపక సభ్యుడిగా ఆ విషయంలో ప్రజలకు క్షమాపణ చెప్తున్నానని అన్నారు. తెలుగు ప్రజల ఐక్యతకు కట్టుబడి ఉన్నానని అన్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర క్షేమం కోసమే పోటీ చేయలేదని స్పష్టం చేశారు. నా దృష్టిలో పడాలని బ్యానర్లు కట్టిన వ్యక్తి మంత్రి అయ్యారు కాని అధికారంలో ఉన్నవాళ్లు ప్రజల బాగోగులను పట్టించుకోలేదని ఆగ్రహించారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జనసేన జెండా ఎగురవేస్తానని పవన్ కల్యాణ్ అన్నారు.