By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 24, 2023, 10:52 PM IST
పార్వతీపురం మన్యం జిల్లాలో వరి పంట చోరీ - కన్నీరుమున్నీరువుతున్న రైతు
Paddy Crop Theft in Parvathipuram Manyam District : పార్వతీపురం మన్యం జిల్లాలో దొంగలు దొరికిందంతా దోచేస్తున్నారు. ఇళ్లు, బళ్లు, దుకాణాలు, చోరీ చేస్తున్న అఘాంతకులను మనం చూస్తూనే ఉన్నాం.. కానీ గుమ్మలక్ష్మీపురం మండలం రేగలపాడు గ్రామంలో కోతకు సిద్ధంగా ఉండే వరి చేనును కోసి పట్టుకుపోయారు కేటుగాళ్లు. పొలాన్ని చూడడానికి వెళ్లిన రైతుకు చేను కాదు కదా కనీసం ధాన్యం గింజ కూడా లేకపోవడంతో అవాక్కవ్వడం ఆయన వంతు అయ్యింది. గిరిజన రైతు పృథ్వీ తెలిపిన వివరాల మేరకు.. ప్రతిరోజు పొలానికి వెళ్లి పంటను పరిశీలించిన విధంగానే ఈరోజు కూడా వెళ్లానని.. పొలంలోనికి వెళ్లేసరికి పంట మొత్తం కోసేసి పట్టుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట లేకపోయే సరికి రైతు ఆందోళన చెందుతున్నాడు. ఇప్పటికే రెండు రోజులుగా జిల్లాలో కురిసిన చిన్నపాటి చిరుజల్లులకు వరి పూర్తిగా తడిసి గింజలు మెులకెత్తాయి. దీంతో తాము పూర్తిగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. వర్షాలు లేకపోయినా వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఏదోలా పంటను కాపాడుకున్నామని.. కానీ చివరి ఇలా పంటను దొచుకుపోవడంతో రైతు కన్నీరుమున్నీరువుతున్నాడు.