జీవో 84ను రద్దు చేయాలని మున్సిపల్ టీచర్ల నిరసన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 8, 2024, 6:11 PM IST
Municipal Teachers Protest Against G.O 84: జీవో 84ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ టీచర్ల నిరసనలు చేపట్టారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ప్లకార్డులు పట్టుకుని ఆందోళన నిర్వహించారు. పురపాలక పాఠశాలలపై అజమాయిషీని విద్యాశాఖకు తీసుకువస్తూ జారీ చేసిన జీవో 84ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 84కు చట్టబద్దత లేదని హైకోర్టు ఆదేశాలిచ్చినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని టీచర్లు వ్యాఖ్యానించారు. పురపాలక పాఠశాలల్లో పనిచేసే టీచర్ల సర్వీసుపై అజమాయిషీ పురపాలక శాఖదేనని నినాదాలు చేశారు.
మున్సిపల్ స్కూళ్లను పురపాలక శాఖ నుంచి పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి తీసుకొస్తూ గత సంవత్సరం జూన్లో ప్రభుత్వం జీవో 84 ఇచ్చింది. సబ్జెక్టు టీచర్లుగా స్కూల్ అసిస్టెంట్లను సర్దుబాటు చేయాల్సింది పోయి సెకండరీ గ్రేడ్ టీచర్లను కేటాయిస్తూ జాబితా విడుదల చేశారు. వీరు ఇంటర్ విద్యార్హతలతో టీటీసీ రాసి ఎస్జీటీలుగా వచ్చిన వారితో సబ్జెక్టులు బోధించడం ఎలా సాధ్యమని పురపాలక ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.