'నోటికాడి కూడు తీసిన అప్పటి ఎమ్మార్వో' - ఓ రైతు వినూత్న నిరసన ప్రదర్శన
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 17, 2023, 5:54 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-11-2023/640-480-20047628-thumbnail-16x9-farmer-innovative-protest.jpg)
Farmer Innovative Protest for Farm in Prakasam District: పొలం విషయంలో అన్యాయం జరిగిందని ప్రకాశం జిల్లాలో ఓ రైతు వినూత్న నిరసన తెలిపాడు. నోటికాడి కూడు తీసిన అప్పటి ఎమ్మార్వో అంటూ రమేష్ అనే రైతు ఎడ్ల బండిపై ఫ్లెక్సీలు కట్టి అధికారుల పేర్లు ప్రచురించి ఆందోళన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని బేస్తవారిపేట మండలం నేకునాంబాద్ గ్రామానికి చెందిన రైతు కొంతమంది కబ్జాదారులు అధికారుల అండతో తన పొలంలో వ్యవసాయం చేసుకోనివ్వడం లేదని.. అధికారుల పేర్లు ఫ్లెక్సీలపై ప్రచురించి ఎడ్ల బండికి కట్టి నిరసన తెలిపాడు.
ముందుగా కంభం పట్టణంలో నిరసన ర్యాలీ చేసి తరువాత అక్కడే జరుగుతున్న స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులుకు వినతి పత్రాన్ని సమర్పించారు. తనకు న్యాయం చేయాలంటూ అధికారులను కోరాడు. బెస్తవారిపేట మండలం నేకునాంబాద్లో తనకు 86 సెంట్ల భూమి ఉందని.. ఆ భూమిలో కబ్జాదారులు నాలుగు అడుగుల మేర గుంతలు తవ్వి ఆ మట్టిని అమ్ముకున్నారని ఫిర్యాదులో తెలిపాడు. ఈ విషయంపై సంబంధిత అధికారులను సంప్రదించి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆ రైతు ఆవేదన చెందుతూ జాయింట్ కలెక్టర్కు తెలిపాడు.