CPM Leaders Fire on YCP Govt: 'ఏపీ అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించడం లేదు'
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 7, 2023, 1:54 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-10-2023/640-480-19705163-thumbnail-16x9-cpm.jpg)
CPM Leaders Fire on YCP Govt: ఏపీలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉందని సీపీఎం నాయకులు విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించడం లేదని మండిపడ్డారు. మట్టి, ఇసుక, ఎర్ర చందనం వంటి వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని సక్రమంగా వసూలు చేసి రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల పంపిణీ విషయంలోనూ రాష్ట్ర ప్రజలను బీజేపీ మోసం చేస్తున్నా.. వైసీపీ ఎందుకు నోరు మెదపడం లేదని సీపీఎం నేతలు ప్రశ్నించారు. రాష్ట్రం గతంలో ఎన్నడూ లేని విధంగా అప్పులు పాలయ్యిందన్నారు. విద్యా, వైద్య రంగాల్లో అనేక మార్పులు తీసుకొచ్చామని వైసీపీ ప్రభుత్వం చెబుతున్నా వాస్తవ లెక్కలు దానికి భిన్నంగా ఉన్నాయని దుయ్యబట్టారు.
కులగణనను కేంద్ర ప్రభుత్వం దేశంలో తక్షణమే చేపట్టాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు లొంగిపోయాయని విమర్శించారు. బీజేపీ అన్ని రకాలుగా రాష్ట్రానికి ద్రోహం చేసిందన్నారు. తాము పొత్తులపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని..ప్రజా పునాది విస్తరణకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అసమానతలు లేని అభివృద్ధి కోసం సీపీఎం ఆధ్వర్యంలో ఏపీ సమగ్రాభివృద్ధి ప్రత్యామ్నాయ విధానాల పేరుతో విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సెమినార్కు సీపీఎం పోలీట్ బ్యూరో సభ్యుడు బి.వీ రాఘవులు హాజరయ్యారు.