By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 24, 2023, 10:56 PM IST
విజయవాడలో కలకలం - దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబుపై దాడి
Attack On Durga Temple Charman Karnati Rambabu: విజయవాడ దుర్గ గుడి చైర్మన్ కర్నాటి రాంబాబుపై హత్యాయత్నం స్థానికంగా కలకలం రేపింది. కాటి కాపరి గుంజా కృష్ణ అనే వ్యక్తి రాంబాబుపై గాజు సీసాతో దాడి చేసి గాయపరిచాడు. దీంతో ఆయనకు గాయాలై రక్తస్రావమైంది. ఇటీవలే రాంబాబు తండ్రి మరణించడంతో.. ఆయన శ్మశానంలో దీపం పెట్టేందుకు వెళ్లారు. శ్మశానంలో దీపం పెట్టి కాళ్లు కడుక్కుంటున్న సమయంలో.. కాటి కాపరి గాజు సీసాతో వెనక నుంచి దాడి చేశాడు. దాడిని గమనించిన రాంబాబు తప్పుకునేందుకు ప్రయత్నించగా సీసా పొట్టలో దిగింది. గమనించిన బంధువులు ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రాణాపాయం లేదని తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ కమిషనర్ రాంబాబును ఫోన్ ద్వారా సంప్రదించి దాడి వివరాలను అడిగి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
దాడి చేసిన వ్యక్తి వివరాలు వెల్లడి: కర్నాటి రాంబాబుపై దాడి చేసింది కాటి కాపరి గుంజా కృష్ణ అనే వక్తి.. అని ఏసీపీ రవికాంత్ తెలిపారు. రాంబాబు తండ్రి సమాధి శుభ్రం చేసేందుకు ఒకరికి కొంత డబ్బు ఇచ్చారని.. తనకు తక్కువ డబ్బులు ఇచ్చారనే కారణంతో కృష్ణ దాడి చేసినట్లు వివరించాడని తెలిపారు. దాడి చేసిన గుంజా కృష్ణను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.