By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 22, 2023, 12:36 PM IST
ఎస్సై అభ్యర్థులపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం - పూర్వాపరాల ప్రస్థావనపై అసహనం
AP High Court Serious on SI Candidates: హైకోర్టును ఆశ్రయించిన ఎస్సై అభ్యర్థుల తీరుపై ధర్మాసనం మరోసారి అసహనం వ్యక్తం చేసింది. న్యాయస్థానం సమక్షంలో ఎత్తు కొలుస్తామని ప్రకటించాక కూడా అర్హులమేనంటూ వైద్యుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తెచ్చినందుకు క్షమాపణలు కోరుతూ పిటిషనర్లు దాఖలు చేసిన అఫిడవిట్లలో కేసుకు సంబంధించిన పూర్వాపరాలను ప్రస్తావించడంపై అభ్యంతరం తెలిపింది. అఫిడవిట్లను ఉపసంహరించుకుంటారా లేదా కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించమంటారా? అని హెచ్చరించింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాది స్పందిస్తూ ఉపసంహరించుకున్న అనంతరం సవరించిన అఫిడవిట్లు వేస్తామని తెలిపారు. అందుకోసం సమయం కోరారు. ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి.నరేందర్, జస్టిస్ న్యాపతి విజయ్తో కూడిన ధర్మాసనం విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. 2018 నాటి ఎస్సై నోటిఫికేషన్ ప్రకారం ఎత్తు విషయంలో అర్హత సాధించిన అభ్యర్థులు 2023 నోటిఫికేషన్లో అనర్హులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ 24మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్పై ధర్మాసనం విచారణ జరిపింది.