విశాఖ మహానగర పాలక సంస్థ ఎన్నికలకు అన్నీ ఏర్పాట్లు పూర్తవుతున్నాయని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ ప్రాంగణాన్ని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. మొత్తం పదకొండు వేలకు పైగా సిబ్బందిని పోలింగ్, కౌంటింగ్ విధుల కోసం కేటాయించినట్లు తెలిపారు. కౌంటింగ్ హాళ్ల పక్కనే స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దీనివల్ల ఎన్నికల ఫలితాలు ప్రకటించటం సులువవుతుందని పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించిన అంశాల పరిశీలనకు నోడల్ అధికారులను నియమించామని చెప్పారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా విధానాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా అన్నీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొత్తగా జీవీఎంసీ పరిధిలోకి విలీనం చేసిన ప్రాంతాల్లోనూ పోలింగ్ కేంద్రాలు గుర్తించి.. మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు. విలీనం తర్వాత మొదట జరిగే మున్సిపల్ ఎన్నికలు కావటంతో అక్కడి ప్రజలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం మీడియా, చరవాణికి మెసేజ్లు పంపటం, ప్రత్యేక పోర్టల్ ను ఉపయోగిస్తున్నట్లు వివరించారు. దాదాపు 18 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు చెప్పారు.
ఉపసంహరణలు
నామినేషన్ల ఉపసంహరణ చివరిరోజు కావటంతో మూడవ జోనల్ కార్యాలయం అభ్యర్థులతో హడావిడిగా కనిపించింది. ఈ జోన్ పరిధిలో 14 నుంచి 27 వార్డుల తెదేపా అభ్యర్థులు బీ ఫారాలను సమర్పించారు. వైకాపా అభ్యర్థులు తమ దరఖాస్తులను పరిశీలించుకున్నారు. ఇప్పటివరకు 128 నామపత్రాలు దాఖలు కాగా, 56 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. 72 మంది బరిలో నిలిచారు.
పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల
జీవీఎంసీ ఎన్నికల బరిలో నిలిచే తెదేపా అభ్యర్థుల రెండవ విడత జాబితాను విడుదల చేశారు. సోమవారం 91 వార్డులకు అభ్యర్థులను ప్రకటించిన తెదేపా మిగిలిన వార్డులకు అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. దక్షిణ, ఉత్తర, గాజువాక నియోజకవర్గాల నుంచి పెండింగ్ లో ఉన్న 7వార్డులకు అభ్యర్థులను ఖరారు చేశారు. గాజువాక 72, 78 వార్డులను సీపీఐ, సీపీఎంకు కేటాయించగా, 36,37 వార్డులను వైకాపా నుంచి తెదేపాలో చేరిన అభ్యర్థులకు ఇచ్చారు.
ఇదీ చదవండి: 'నా నలభై ఏళ్ల రాజకీయంలో ఇలాంటి ఎన్నికలు చూడలేదు'