ప్రకాశం జిల్లాలో జల జీవన్ మిషన్, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల ప్రతిపాదనలపై ప్రకాశం భవన్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జల జీవన్ మిషన్ పథకం కింద అన్ని గ్రామాల్లో ఇంటింటికీ కుళాయి ద్వారా తాగు నీటిని సరఫరా చేసేందుకు రూ.889.44 కోట్లతో అంచనాలు తయారు చేసినట్లు కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు.
2022 నాటికి జిల్లాలోని 2,248 గ్రామాల్లో 5,15,628 కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రతిపాదనలు తయారు చేయడం జరిగిందన్నారు. తొలి విడతగా 2020-21లో 2,09,833 కుటుంబాలకు కుళాయిలు ఇచ్చేందుకు రూ.164.58 కోట్లతో అంచనాలు రూపొందించినట్లు తెలిపారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కింద జిల్లాలో తాగునీటి సరఫరాకు రూ.5,150 కోట్లతో అంచనా వేయగా... అందులో తొలి విడతగా కనిగిరి ప్రాంతానికి రూ.833 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సంజీవరెడ్డి, జేడీఏ శ్రీరామమూర్తి, డీఈవో సుబ్బారావు, డ్వామా పీడీ శీనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ-మార్కెటింగ్లో పంట ఉత్పత్తుల విక్రయం...
రైతులు పండించిన పంట ఉత్పత్తులను ఈ-మార్కెటింగ్ విధానంలో విక్రయించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. ఈ విషయమై అనుబంధ శాఖల అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న రబీ సీజన్ నాటికి పూర్తిస్థాయిలో ఈ-మార్కెటింగ్ విధానం అమల్లోకి తీసుకురావాలన్నారు. గ్రౌండ్ లోకల్లీ ప్ల్లాట్ఫాం సంస్థ ద్వారా నూతన విధానం ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తున్న రైతు నష్టపోకూడదన్న ఉద్దేశంతోనే... సాంకేతిక అభివృద్ధిని వ్యవసాయ రంగానికి జోడిస్తున్నామన్నారు. ఉత్పత్తులు నిల్వకు అవసరమైన గోదాములను త్వరగా నిర్మించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి మండలంలో 500 మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు వీలుగా గోదాములు నిర్మించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా చేపడుతున్న 299 గోదాముల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జేసీ వెంకట మురళి, జేడీఏ శ్రీరామమూర్తి, ఏపీఎంఐపీ పీడీ రవీంద్రబాబు, ఆర్డీవోలు ప్రభాకర్రెడ్డి, ఓబులేసు, శేషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి..