Tribals Demand Construction Of Bridge Over Jalleru Vagu : ఆ వాగుపై వంతెన నిర్మాణం గిరిజనుల కల. ఏజెన్సీ ముఖద్వారంగా చెప్పుకునే ఆ ప్రాంతం నుంచి అటు తెలంగాణ, ఇటు ఏలూరు జిల్లాకు రావాలంటే ఆ వాగు దాటాల్సిందే. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభమై ఆ తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోక నేటికీ ఆ మార్గంలో ప్రయాణం ప్రాణసంకటంగా మారింది.
వంతెన నిర్మాణం గాలికి : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి ఏజెన్సీ ప్రాంతాలతోపాటు తెలంగాణకు వెళ్లే రహదారి ఇది. ఈ మార్గంలో పట్టెనపాలెం వద్ద జల్లేరు వాగుపై వంతెన లేక ప్రయాణికులు నరకం చూస్తున్నారు. 2018లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం 5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జల్లేరు వాగుపై హైలెవల్ వంతెనకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం దిగిపోయే నాటికి పిల్లర్లు పూర్తి చేసి ఓ వైపు శ్లాబు నిర్మాణం చేపట్టారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వంతెన నిర్మాణం గాలికొదిలేసింది. రెండు వైపులా అప్రోచ్ రోడ్లు వేసి, పైన శ్లాబులు పూర్తి చేస్తే వంతెన అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నా వైఎస్సార్సీపీ నాయకులు పట్టించుకున్న పాపానపోలేదు.
పూర్తి కాకుండానే శిథిలావస్థకు : వంతెన పూర్తి కాక, కల్వర్టు నిర్మాణం రాళ్లు తేలి అంతంతమాత్రంగానే ఉండటంతో ఈ మార్గం గుండా ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వాగులో దిగి ఎక్కే క్రమంలో వాహనాలు అదుపుతప్పి పడిపోయి కొంతమంది గాయపడిన సందర్భాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇక వర్షాకాలంలో వరదతో ఈ వాగు పోటెత్తుతుంది. నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టే వరకు రాకపోకలు సాగించడానికి వీలుండదు. వైఎస్సార్సీపీ పాలకులు నిర్మాణ పనులు పట్టించుకోక పిచ్చి మొక్కలు మొలిచి పూర్తి కాకుండానే శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితిలో వంతెన కనిపిస్తోంది.
40 గ్రామాలకు ఇదే మార్గం : జల్లేరు వాగు అవతలివైపున ఉన్న సుమారు 40కి పైగా గ్రామాలకు ఇదే మార్గం. ఐదేళ్లుగా ఈ మార్గంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. వర్షాకాలంలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఏజెన్సీ మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరుకు వెళ్లేందుకూ ఇదే ప్రధానమార్గం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికీ ఈ వాగు దాటుకునే వెళ్లాలి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రహదారిలో వంతెన నిర్మాణం కలగా మారింది.
ఉప్పొంగిన కట్టలేరు- వంతెనమీదుగా రాకపోకలు నిలిపివేత - Kattaleru Vagu Over flowing