Protest at Narasaraopet Private Hospital : ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వెళ్తే ఏకంగా ఆ చిన్నారి ప్రాణాలే పోయాయి. వైద్యం వికటించి ఆ బాలుడు మరణించాడు. మరోవైపు బాబు చనిపోయాడన్న విషయం తమకు చెప్పకుండా ట్రీట్మెంట్ పేరుతో తమ దగ్గర డబ్బులు వసూలు చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని వారు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో చోటుచేసుకుంది.
దీనికి సంబంధించి బాలుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన విక్రమాదిత్య (3) అనే బాలుడు వినికిడి లోపంతో బాధపడుతున్నాడు. ఆదివారం నాడు ఆ చిన్నారిని నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. వైద్యులు బాలుడికి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేశారు. అయితే ఆపరేషన్ వికటించడంతో విక్రమాదిత్య మృతిచెందాడు. అయితే ఈ విషయాన్ని దాచిపెట్టిన వైద్యులు సాయంత్రం వరకూ వివిధ కారణాలతో ట్రీట్మెంట్ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులను నమ్మించారు.
Child Died in Narasaraopet : ఆదివారం రాత్రి బాలుడు మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వైద్యులు చెప్పారు. దీంతో వారు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అంతేకాక అరోగ్యశ్రీ అని చెప్పి రూ.50,000లు డిపాజిట్ చేయించుకుని బిల్లు కూడా ఇవ్వలేదు. ఆరోగ్యంగా ఉన్న బాలుడిని ఆపరేషన్ పేరుతో వైద్యులు పొట్టనబెట్టుకున్నారని బంధువులు వాపోయారు. కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇవాళ చిన్నారి మృతదేహంతో ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో నరసరావుపేట-సత్తెనపల్లి ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. కానీ తమకు న్యాయం చేయాలంటూ ఆసుప్రతిలోకి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దీంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.