చేనేతే ఆధారం
అనంతరవరం గ్రామానికి చెందిన రామలింగానికి చేనేత పట్ల మక్కువ ఎక్కువ. కానీ కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో పిల్లల చదువుల కోసం వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకొంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. తన పూర్వీకుల నుంచి వచ్చిన చేనేత వృత్తిని కొనసాగించాలనే కోరికతో... తన పిల్లలకు చేనేత రంగ ఆధునిక పద్ధతులలో శిక్షణనివ్వాలని భావించారు. రామలింగం రెండో కుమారుడు నవజ్యోత్ తండ్రి ఆశయానికి రూపం ఇచ్చారు.
యంత్రీకరణతో
ముంబయిలో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్( బిఎంఎస్) చదవిని నవజ్యోత్ ... చదువు అనంతరం వ్యాపారంలోకి అడుగుపెట్టాలని భావించారు. వంశపారంపర్యంగా వస్తున్న వస్త్రాల తయారీయే సరైన రంగంగా ఎంచుకున్నారు. అనుకున్నదే తడువుగా తండ్రి సహకారంతో ప్రకాశం జిల్లా మద్దిపాడు గ్రోత్ సెంటర్లో స్థలాన్ని కొనుగోలు చేశారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ సహకారంతో పవర్లూమ్ ఏర్పాటు చేసి వస్త్ర ఉత్పత్తులు ప్రారంభించారు.
అనతి కాలంలోనే..అభివృద్ధి
కాటన్ వస్త్రాలకు డిమాండ్ ఉందని తెలుసుకుని.. ఆధునిక యంత్రాలతో పరిశ్రమ ఏర్పాటు చేశారు. బ్యాంకు రుణాలు, విద్యుత్తు రాయితీలతో రెండేళ్ళ కిందట స్థాపించి, అనతి కాలంలోనే వ్యాపారంలో నిలదొక్కుకున్నారు. పలు కంపెనీల నుంచి వస్తోన్న ఆర్డర్లతో వివిధ రకాల వస్త్రాల ఉత్పత్తి ప్రారంభించారు. ఏకరూప దుస్తులు, చొక్కాలు, ఫ్యాంట్లు, దుప్పట్లు వంటివి ఉత్పత్తి చేస్తూ వివిధ ప్రాంతాలకు ఎగుమతులు చేస్తున్నారు.
తల్లిదండ్రుల సహకారంతో
పరిశ్రమ ఏర్పాటు చేయడం గొప్ప విషయం కాదని, నిరంతరం శ్రమిస్తేనే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని అంటున్నారు నవజ్యోత్. మార్కెట్ను విస్తరించి, ఉత్పత్తిని పెంచేందుకు కృషిచేస్తున్నామని ఆ యువకుడు తెలిపారు. తల్లిదండ్రుల సహకారంతో పరిశ్రమను విజయవంతంగా నడిపిస్తున్నానని పేర్కొన్నారు. తమ కుటుంబాలకు వస్త్ర తయారీ తప్ప మరొకటి తెలీదని, అందువల్లనే ఈ రంగంలో యంత్రీకరణతో ఉత్పత్తులు ప్రారంభించామని నవజ్యోత్ తండ్రి రామలింగం తెలిపారు.
బలహీనవర్గాలు, వెనుకబడిన వారని.. అవకాశాలు లేవని కుంగిపోకుండా, పట్టుదలతో శ్రమిస్తే ఎవరైనా ఏ రంగంలోనైనా మంచి ఫలితాలు సాధించవచ్చని నవజ్యోత్ నిరూపిస్తున్నాడు.
ఇదీ చదవండి :