ప్రకాశం జిల్లా ఒంగోలులో కొవిడ్ బాధితులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వ్యాధి బారిన పడిన వారి ఆరోగ్య పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ.. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. జిల్లా నలుమూలల నుంచి ఒంగోలు కరోనా ఆసుపత్రికి వచ్చేవారికి చాలినన్ని పడకలు లేక, నేలమీద పడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గతంలో ఐసొలేషన్ కేంద్రాలు, క్వారంటైన్ కేంద్రాలు ఉండటం వల్ల.. అనుమానిత లక్షణాలు ఉన్న వారందిరినీ అక్కడికి తరలించి వైద్యం అందించేవారు. ఇప్పుడా పరిస్థితి లేకపోవడం, కేసులు పెరిగిపోవటం వల్ల.. కొవిడ్ రోగులతో ఒంగోలు జీజీహెచ్ కిటకిటలాడుతోంది. ఆసుపత్రిలో ఉన్న వెయ్యి పడకలు నిండిపోయి.. కొత్తగా వచ్చేవారికి బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక అల్లాడిపోతున్నారు.
సొంతంగా ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చుకొని..
బెడ్లు దొరకనివారు ఓపీ వద్ద, చెట్ల నీడన, ఆ పక్కనే ఉన్న షెడ్డులో నేలపైనే పడుకోవాల్సి వస్తోంది. ఇలాంటి వారిలో ఊపిరాడని పరిస్థితి ఉన్న రోగులు.. సొంతంగా ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చుకుని బెడ్డు ఎప్పుడు దొరుకుతుందా అని పడిగాపులు పడుతున్నారు. అయితే తమ వంతు ఎప్పుడు వస్తుందో తెలియక, కింద పడుకోలేక యాతన అనుభవిస్తున్నారు. రోగులతోపాటు వచ్చిన బంధువులు, అలాగే ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం వచ్చిన వారితో జీజీహెచ్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
నెల్లూరు జిల్లాలో...
” కొవిడ్ కాల్ సెంటర్కు రోగి ఫోన్ చేసిన మూడు గంటల్లో ఆస్పత్రిలో.. పడక కేటాయించాలి.”ఇటీవల సమీక్షలో ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలివి. ఆ భరోసాతో ఆస్పత్రికి వెళ్లిన ఈ దంపతులు ఇదిగో ఆస్పత్రి గడప బయటే ఇలా అవస్థలు పడాల్సి వచ్చింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలానికి చెందిన ఈ దంపతులకు కరోనా సోకింది. భార్యపరిస్థితి కొంచెంబాగానే ఉన్నా భర్త మాత్రం కూర్చునే ఓపిక కూడా లేక ఇలా ఆత్మకూరు జిల్లా ఆస్పత్రి మెట్లపైనే పడుకున్నాడు. మెరుగైన వైద్యం అందుతుందని ఉదయగిరి నుంచి ఆత్మకూరు వస్తే బెడ్లు ఖాళీగా లేవని, నెల్లూరు వెళ్లాలని వైద్యులు సలహా ఇచ్చారని వాపోయారు.
గుంటూరు జిల్లాలో...
ఇక తెనాలి ప్రభుత్వాస్పత్రిలో మాట్లాడుతున్న ఈమెది మరో ఆవేదన. ఆరోగ్యం బాగోలేని అత్త,మామలను తెనాలి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చానని, పడకలు ఖాళీ లేవంటూనే దళారులు డబ్బు కోసం బేరాలు ఆడుతున్నారని వాపోయారు. నిజానికి తెనాలి ప్రభుత్వాస్పత్రిలో కొవిడ్ చికిత్స కోసం 220 బెడ్లు సిద్ధం చేయగా అన్నీ నిండిపోయాయి. ఎవరైనా కోలుకుని డిశ్చార్జ్ అయితే.. ఆ పడకను వేరేవారికి కేటాయిస్తున్నారు. ఆ సమయంలో దళారులు రోగుల అవసరాల్ని సొమ్ముచేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లాలో...
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు బీడీ కాలనీకి చెందిన వీరిది ఇంకో విషాద గాథ ! జయలక్ష్మి అనే మహిళ తీవ్ర అస్వస్థతకు గురవడంతో.... బందువులు ఆమెను జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొవిడ్ టెస్ట్ రిపోర్టు లేనిదే వైద్యం అందించబోమంటూ వైద్యులు పట్టించుకోలేదని బంధువులు ఆరోపించారు. ఈలోపే జయలక్ష్మి చనిపోయిందంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. వైద్యులు వెంటనే స్పందించి ఉంటే ప్రాణం పోయేది కాదని వాపోయారు.
ఇదీ చదవండి: