ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని మారేళ్ల గ్రామానికి చెందిన కొండారెడ్డి, విజయ దంపతులకు పక్షులంటే ప్రాణం. కొండారెడ్డి గ్రామ రెవెన్యూ అధికారి. విజయ గృహిణి. వీరికి ఇద్దరు కుమారులు. వారు ఉద్యోగ, వ్యాపార రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. పక్షులు పెంచాలనే కోరికను ఆ దంపతులు తమ కుమారులకు తెలిపారు. వారి చిన్న కుమారుడు చెన్నై నుంచి నాలుగు రకాల పక్షులను తెచ్చి ఇచ్చారు. అప్పటినుంచి ఆ దంపతులకు పక్షులను పెంచటం పరిపాటైంది.
పక్షులు పెద్దగా అవుతున్న సమయంలో వాటి సౌలభ్యం కోసం గ్రిల్స్తో షెడ్ను ఏర్పాటు చేశారు కొండారెడ్డి దంపతులు. ఇంట్లో పాడైన కుండలకు రంధ్రాలు చేసి... అవి గుడ్లు పెట్టేందుకు అనువుగా అమర్చారు. పక్షులు వాలేందుకు రెండు కర్రలను ఏర్పాటు చేశారు. పక్షులపై ప్రత్యక శ్రద్ధ చూపిస్తున్నారు. నాలుగుతో మొదలైన పక్షులు ఇప్పుడు ఆరవైకి చేరాయి. ఉద్యోగంలో పని ఒత్తిడితో ఇంటి కొచ్చే కొండారెడ్డి... పక్షుల ఆలనా.. పాలనా చూస్తూ ఉపశమనం పొందుతాడు. తన భర్త ఉదయం వెళ్లినప్పటి నుంచి పక్షులకు నీళ్లు, మేత వేస్తూ మానసికంగా ఉల్లాసాన్ని పొందుతున్నారు విజయ.
ఇదీ చదవండి: సామాన్యులకూ అందుబాటులోకి శ్రీవారి కల్యాణ లడ్డూ