వైకాపా ప్రభుత్వం దేవాదాయశాఖ భూములను కూడా అన్యాక్రాంతం చేస్తోందని భాజపా విమర్శించింది. నెల్లూరు నగరంలోని దేవాదాయ శాఖ కార్యాలయం ఎదుట భాజపా నేతలు నిరసన వ్యక్తం చేశారు.
వెంకటాచలం మండలంలోని సీతమ్మ చలివేంద్ర భూములను ఇళ్ల స్థలాల కోసం రెవెన్యూ అధికారులు తీసుకుని పనులు ప్రారంభించారని భాజపా నేత మిడతల రమేష్ అన్నారు. ఇది సరి కాదని సూచించారు. తీర్థయాత్రలు చేసే యాత్రికులకు వసతి, ఆకలి తీర్చేందుకు వంద సంవత్సరాల క్రితం సీతమ్మ చలివేంద్రం ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. సీతమ్మ చలివేద్రానికి సంబంధించి ఏడు ఎకరాల భూమిపై హైకోర్టు స్టే, దేవదాయ శాఖ అభ్యంతరాలున్నా ఇక్కడే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించడం బాధాకరమన్నారు.
దగదర్తి మండలం తిరువీధిపాడులోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కొండలు పగులగొట్టి ప్లాట్లు ఏర్పాటు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ భూములను దైవకార్యాలకు మాత్రమే వినియోగించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు ఆందోళన