కేంద్రం తెచ్చిన చట్టాన్ని ఉల్లంఘించి రాష్ట్రం చట్టం చేస్తే రాష్ట్రపతి సంతకం విధిగా అవసరమని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. అమరావతికి రాష్ట్రపతి అనుమతి తీసుకున్నారా? అనడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రపతి చేసిన చట్టం, కేంద్రం కమిటీ ద్వారానే అమరావతి రాజధానిగా ఏర్పడిందని యనమల గుర్తు చేశారు. ప్రజలను, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించేలా సలహాదారుల వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర చట్టాలు పూర్తిగా అధ్యయనం చేయాలని.., ఆ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వానికి సరైన సలహాలు ఇవ్వడం సముచితమని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం కేంద్ర చట్టంతో ముడిపడిన అంశమని.. దానిని తోసిరాజని దొడ్డిదారిన రాష్ట్ర చట్టం తేవాలని చూడటంపైనే తెలుగుదేశం అభ్యంతరం వ్యక్తం చేస్తోందని పేర్కొన్నారు. కేంద్రాన్ని, రాష్ట్రపతిని తోసిరాజని రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్దమని ధ్వజమెత్తారు. రాష్ట్రపతిని, కేంద్రాన్ని, న్యాయస్థానాలను గౌరవించడం ప్రభుత్వాల విద్యుక్త ధర్మమన్నారు.
ఇదీ చదవండి: శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ తాత్కాలికంగా నిలిపివేత