రాష్ట్రంలో తీసుకొచ్చిన ఆపదమిత్ర వాలంటీర్లకు శిక్షణను పూర్తి చేసినట్లు ఫైర్ అధికారులు తెలిపారు. తుపాన్లు, వరదలు, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఫైర్, పోలీసు, అంబులెన్స్ సిబ్బంది రావడానికి ముందే ఆపదలో ఉన్న వ్యక్తిని రక్షించడం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు ఎక్కువగా ఉన్న మండలాల్లోని యువతకు ఈ శిక్షణ ఇస్తున్నారు. గ్రామానికి ఒకరు చొప్పున.. 100 మంది వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఇందులో భాగంగా ఏపీలోని 13 జిల్లాల్లో కృష్ణా జిల్లాను ఎంపిక చేసి గతంలో రూ. 40 లక్షల నిధులు మంజూరు చేశారు. మొదటి విడతలో 2019 ఏడాది మచిలీపట్నం, బంటుమిల్లి, అవనిగడ్డ మండలాల్లో విజయవంతంగా 100 మంది యువకులకు శిక్షణను పూర్తి చేసారు. కోవిడ్ కారణంగా ఆలస్యం అయినా.. రెండవ విడతలో మచిలీపట్నం, బంటుమిల్లి, కృత్తివెన్ను, అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక, కోడూరు మండలాల్లో గ్రామానికి ఒకరు చొప్పున 98 మందికి శిక్షణ ఇచ్చినట్లు ఫైర్ అధికారులు తెలిపారు. త్వరలో వీరికి పరికరాలను అందిస్తామని అన్నారు. అనంతరం ఆపదలో ఉన్న వారిని ఎలా రక్షించాలో వీరు చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ శాసన సభ్యుడు సింహాద్రి రమేష్ బాబు, ఫైర్ అధికారులు డీ శ్రీనివాస్, పీవీ రమణ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: