
వ్యవసాయ కూలీలు, ఏదైనా కంపెనీలలో పనిచేసే కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న గ్రీన్ జోన్ నుంచి మరో గ్రీన్ జోన్ కి వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారు. వలస కూలీలు ఎక్కడ ఎంత మంది ఉన్నారో లెక్కించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. కూలీలందరికీ ర్యాపిడ్ విధానంలోకరోనా పరీక్షలు నిర్వహిస్తారు. నెగిటివ్ గా నిర్ధారణ అయిన వారిని మాత్రమే అనుమతిస్తారు. ఒకవేళ ప్రస్తుతం ఒక చోట ఉంటున్న బృందంలో ఒకరికి పాజిటివ్ వచ్చినా మిగతా వారు కూడా ప్రస్తుతం ఉన్న చోటే ఉండాలి. పాజిటివ్ వచ్చిన వారికి కరోనా నిబంధనల మేరకు ఆసుపత్రికి తరలిస్తారు. వారితో ఉన్న వారిని క్వారంటైన్ తరలించి వైద్య సాయం అందిస్తారు. నెగిటివ్ వచ్చిన వారి సొంత ఊర్లకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పిస్తారు. భౌతిక దూరం పాటిస్తూ బస్సులో ఉండే సీట్లలో యాభై శాతం మాత్రమే ప్రయాణం చేసేలా అనుమతిస్తారు. సొంత ఊరికి వెళ్లిన తర్వాత అక్కడి క్వారంటైన్ కేంద్రాల్లో 14 రోజులు తప్పనిసరిగా ఉండాలి. 14 రోజుల తర్వాత ఇంటికి వెళ్లినా వారు హోం క్వారంటైన్ లో ఉండేలా సంబంధిత గ్రామ కార్యదర్శి చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎక్కువగా వలస కూలీలు ఉన్నారని ఉత్తర్వులలో పేర్కొన్నారు.