Three States Irrigation Ministers Meeting in Rajasthan : రాజస్థాన్లోని ఉదయ్పుర్లో అఖిలభారత స్థాయి జలవనరుల మంత్రుల సమావేశం సందర్భంగా రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, తెలంగాణ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఏ రాష్ట్ర రైతులూ నష్టపోకుండా నీటి వివాదాలను సానుకూలంగా పరిష్కరించుకుందామని మంత్రులు నిర్ణయించుకున్నారు. కృష్ణా జలాలపై మాట్లాడేటప్పుడు.. కేవలం ఈ ఏడాది నదిలో లభ్యమైన నీటిని దృష్టిలో పెట్టుకుని చర్చించుకోవడం సరికాదని రామానాయుడు అన్నారు. తెలంగాణ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ఇద్దరితో కృష్ణా అంశాలు చర్చకు వచ్చాయి.
సరైన సమయంలో రాక: నిజానికి దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్కు కృష్ణాజలాలు సరైన సమయంలో అందక ఇక్కడి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. పదేళ్లుగా కృష్ణా జలాల లభ్యత ఎలా ఉందో దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల వంటి ప్రాజెక్టులు నిండితే తప్ప శ్రీశైలానికి నీళ్లు రావని తెలిపారు. ఈ పరిస్థితుల్లో కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారిందన్నారు.
సరైన ప్రణాళికతో: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ఉన్న నీటిని వినియోగించుకునే విషయంలో తెలంగాణ, ఏపీ అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. రెండు రాష్ట్రాల రైతులకు ఇబ్బంది లేకుండా, తాగునీటికి సమస్య రాకుండా ఈ నీటిని సమర్థంగా పరస్పర అంగీకారంతో జూన్ వరకు సరైన ప్రణాళికతో వినియోగించుకుందామని మంత్రి రామానాయుడు ఉత్తమ్కుమార్ రెడ్డితో చెప్పారు.
చంద్రబాబును కలుస్తా: తుంగభద్ర నదిలో పూడిక నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా కర్ణాటక కొన్ని ప్రాజెక్టులు ప్రతిపాదిస్తోందని, ఇందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి సానుకూలత అవసరమని కర్ణాటక జలవనరులశాఖ మంత్రి డీకే శివకుమార్ మంత్రి రామానాయుడితో అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తామని, అపాయింట్మెంట్ కావాలని తెలిపారు. తొలుత ఈ ప్రతిపాదనలపై రెండు రాష్ట్రాల అధికారుల స్థాయిలో సమావేశాలు నిర్వహించుకుందామని రాష్ట్ర మంత్రి రామానాయుడు ప్రతిపాదించారు. ఆ తర్వాత సీఎం వద్దకు ఈ అంశాలు తీసుకువెళ్లవచ్చని పేర్కొన్నారు.
పోలవరంపై ప్రత్యేక శ్రద్ధ: పోలవరం ప్రాజెక్టును నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు సహాయ, సహకారాలు అందిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ హామీ ఇచ్చినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం పోలవరం ప్రాజెక్టు పై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారని సీఆర్ పాటిల్ తెలిపారన్నారు. రాజస్థాన్లోని ఉదయ్పుర్లో నిర్వహించిన రాష్ట్రాల జలవనరులశాఖ మంత్రుల సదస్సుకు హాజరైన నిమ్మల కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి ప్రత్యేక నివేదిక ఇచ్చినట్లు నిమ్మల చెప్పారు.
జాతీయ జలభద్రతలో పోలవరం ప్రాజెక్టు కీలకం : మంత్రి నిమ్మల
కేంద్ర జలశక్తి మంత్రితో నిమ్మల భేటీ - పోలవరం ప్రాజెక్టుపై కీలక చర్చలు