రైతులకు మరణ శాసనంగా మారనున్న చట్టాలను కేంద్రం తక్షణమే రద్దు చేయాలని, అప్పటి వరకు పోరాటం ఆపేది లేదని... ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి అధ్యక్షుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. దిల్లీలో కర్షకుల ఆందోళనకు మద్దతుగా సోమవారం విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన రైతు గర్జన సభలో వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. కేసుల భయంతోనే సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు రైతుల ఉద్యమానికి దూరంగా ఉన్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ కేంద్రాన్ని పల్లెత్తు మాటా అనడం లేదన్నారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవరావు మాట్లాడుతూ. ఈ నెల 6న జరిగే రాష్ట్ర రైతు సంఘాల సమావేశంలో చర్చించి ప్రణాళికను ఖరారు చేస్తామన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ మాట్లాడుతూ.. స్వామినాథన్ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తెచ్చినవి వ్యవసాయ చట్టాలు కావని, వ్యాపార చట్టాలని విమర్శించారు.
కదంతొక్కిన కర్షకులు
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా విజయవాడలో రైతులు కదం తొక్కారు. స్థానిక బీఆర్టీఎస్ రోడ్డులోని పడవలరేవు సెంటర్ నుంచి మీసాల రాజేశ్వరరావు వంతెన వరకు ద్విచక్రాలు, ట్రాక్టర్లతో ర్యాలీలో పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తదితరులు మద్దతు తెలిపారు. పలు సంఘాల నేతలు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పవన్ వకీల్ సాబ్ కాబట్టే వాస్తవాలు చెప్పారు: పోతిన మహేశ్