గుంటూరు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం జరిగిన గోపూజ కార్యక్రమంలో ఓ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. మున్సిపల్ స్టేడియం ప్రాంగణంలో జరిగిన ఈ మహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో గంగిరెద్దులతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. సీఎం రాగానే గంగిరెద్దు తన యజమాని చెప్పినట్లు ఆడుతోంది. ఆ సమయంలో పక్కనే బారికేడింగ్ కోసం ఏర్పాటు చేసిన ఇనుప కడ్డీ గంగిరెద్దు మెడకు తగులుతోంది. వెంటనే గమనించిన ముఖ్యమంత్రి గంగిరెద్దు మెడకు గాయమవుతుందనే ఉద్దేశంతో ఇనుప కడ్డీపై తన చేయి ఉంచారు. ఆ తర్వాత గంగిరెద్దు యజమానికి చెప్పి దాన్ని కొంచెం పక్కకు తప్పించారు. ఆ తర్వాత గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఏర్పాటు చేసిన ఈ పూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి సంప్రదాయ పంచకట్టు, కండువాతో హాజరయ్యారు. వేద మంత్రాల నడుమ గో మాతకు, దూడకు పట్టు వస్త్రాలు, పూలమాలలు, పసుపు కుంకుమ సమర్పించి హారతి ఇచ్చారు. వాటి చుట్టూ ప్రదక్షిణ చేశారు.
ఇదీ చదవండి